టీడీపీ నాయకులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(సర్) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లకు కీలకమైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఓట్ల చేర్పు, కూర్పులు ఎలా ఉంటాయి? అనే విషయాలను చంద్రబాబు వారికి వివరించారు. ఒక్క ఓటే కదా..అని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చంద్రబాబు ఈ సందర్భంగా నాయకులకు సూచించారు.
సర్ ప్రక్రియను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. ఒక్క ఓటు పోయినా.. పార్టీకి నష్టమేనన్నారు. గత ఎన్నికల్లో కంటే.. వచ్చే ఎన్నికల్లో మరింత ఎక్కువ విజయం దక్కించుకోవాలంటే.. సర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు.. అందరూ అప్రమ త్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా నాయకులు ఓటర్లను చేర్పించే విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. ఒకవేళ.. ఎక్కడైనా ఓట్లను తొలగించాల్సి వస్తే.. ఒకటికి రెండు సార్లు వాటిని సరిచూసుకోవాలని.. నిబంధనల మేరకు మాత్రమే తొలగించేలా చూడాలని కోరారు.
గొడ్డలి పార్టీతో జాగ్రత్త!
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ.. ఏదైనా చేస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ ఓట్లను తీసి వేయించే అవకాశం ఉందని.. పొరుగు రాష్ట్రాల వారిని చేర్పించే అవకాశం ఉందని హెచ్చరించారు. దొంగపేర్లు.. నకిలీ డోర్ నెంబర్లు వేసి.. గతంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఇలానే వ్యవహరించారని గుర్తు చేశారు. ఇప్పుడు సర్ ప్రక్రియలోనూ వైసీపీ ఇలానే చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి.. గొడ్డలి పార్టీ చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలివిడిగా వ్యవహరించి.. సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని.. అధికారుల కు కూడా సహకరించాలని సూచించారు.
అందరూ సైకిళ్లే..
అందరూ సైకిళ్లను వినియోగించాలనిపార్టీనాయకులకు చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగించడం వల్ల.. ఆరోగ్యానికి ఆరోగ్యంతోపాటు.. ఇంధనం కూడా ఆదా అవుతుందన్నారు. ఇదేసమయంలో పార్టీ ఎన్నికల గుర్తు కు మరింత ప్రచారం లభిస్తుందని చెప్పారు. అవసరమైతే.. నియోజకవర్గాల కార్యకర్తలకుఎమ్మెల్యేలే సైకిళ్లను కొనుగోలు చేసి ఇవ్వాలని సూచించారు. ఇంటింటికీ సైకిల్పై తిరగడం వల్ల.. ఇటు పార్టీకి.. అటు వ్యక్తిగతంగా నాయకులకు కూడా మేలు జరుగుతుందని సూచించారు. తాను కూడా సైకిల్నే వినియోగిస్తానని చెప్పారు.