తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్నికూల్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలేనని చెప్పారు. అయితే.. తమిళనాడు ప్రజల ఆశీర్వాదం తనకే ఉందని.. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఒకవేళ తనకు ఏ ప్రమాదం(ప్రభుత్వం కూల్చేయడం) ఉన్నా.. తమిళులు ఊరుకోరని.. దీనికి రెట్టింపు సమాధానం(మెజారిటీ) చెబుతారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఆయన తిరుచ్చి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సోమవారం సాయంత్రం ప్రసంగించారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆయన.. అందరినీ పలకరించారు. తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు. ప్రజలకు సాధారణ పౌరులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజలను మెప్పించలేని నాయకులు.. ఇప్పుడు తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. డీఎంకే అన్నాడీఎంకేలపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు.
ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. ఈ బుడ్డోడే(మాజీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు) విజయం దక్కించు కుంటాడమని విజయ్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆరు మాసాల పాటు పన్నెత్తు విమర్శ కూడా చేయమని చెప్పిన పెద్ద మనుషులు(మాజీ సీఎంలు) కనీసం ఆరు రోజులు కూడా ఆగలేక పోయారని అన్నారు. ఏకంగా సర్కారునే కూల్చే ప్రయత్నాలు చేశారని.. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి ఎన్నికలోనూ టీవీకేనే విజయం దక్కించుకుంటుందన్న ధీమా తనకు ఉందని తెలిపారు.
రాష్ట్ర హక్కులు, లౌకిక వాదం విషయంలో తాను రాజీ పడేది లేదని.. పరోక్షంగా కేంద్రంపై వ్యాఖ్యలు గుప్పించారు. తాను ఎంజీ ఆర్, పెరియార్ అంత గొప్ప నేతను కాదని.. ఒక సాధారణ వ్యక్తినని.. ప్రజలే తనకు ఈ పదవిని ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని, ప్రజలను వంతుల వారీగా మోసం చేసిన వారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారని.. పరోక్షంగా డీఎంకే, అన్నాడీఎంకేలపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికీ.. ఎప్పటికీ డీఎంకే(స్టాలిన్)-టీవీకే మధ్యే పోటీ ఉంటుందని.. మత శక్తులతో తనకు ఎలాంటి పోటీ ఉండబోదని తేల్చి చెప్పారు.
పారదర్శకత కోసమే..
తాను సూటు ధరిస్తున్నది పారదర్శకతకోసమేనని విజయ్ చెప్పారు. తెలుపు, నలుపు పారదర్శకతకు చిహ్నాలని.. అందుకే తాను సీఎంగా వ్యవహరించేప్పుడు.. సూటును ధరిస్తున్నట్టు చెప్పారు. తద్వారా ప్రజలకు సరైన సందేశాన్ని ఇవ్వాలన్నదే తన అభిమతమన్నారు. అవినీతికి కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని చెప్పారు. ఎక్కడా రూపాయి అవినీతికి పాల్పడడానికి వీల్లేని ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడుపుతామని చెప్పారు. తనవారైనా.. పరాయి వారైనా ఎవరైనా ఈ విషయంలో శిక్షార్హులేనని తేల్చి చెప్పారు.