తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిందన్న బాధ లేదన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని చెప్పారు. ``57 స్థానాలు వచ్చాయా... 27 స్థానాలు వచ్చాయా.. అన్నదికాదు. చివరకు 10 స్థానాలు గెలిచినా.. ప్రజల కోసం అసెంబ్లీకే వెళ్తాం. ఇంట్లో కూర్చోం. అలా చేస్తే.. పార్టీ ఎందుకు.. నాయకులు ఎందుకు? ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం.. నడుచుకుంటాం.`` అని వ్యాఖ్యానించారు.
అయితే.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఏపీ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ను సూటిగా ఉద్దేశించి నవేనని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఏప్రిల్లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపు గుర్రం ఎక్కారు. 108 స్థానాలు దక్కించుకున్నారు. అయితే మెజారిటీ కోసం.. ఇతర పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చారు. ఈ సమయంలో తమిళనాట జగన్ బొమ్మను పట్టుకుని విజయ్ ప్రచారం చేశాడంటూ.. కొందరు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ క్రమంలో తాజాగా స్టాలిన్చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. శనివారం సాయంత్రం.. మరో విపక్ష పార్టీ అన్నాడీఎంకే పార్టీ నుంచి కొందరు నాయకులు డీఎంకే పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పిన స్టాలిన్.. తాను ఓడిపోయిన విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. ప్రజల నిర్ణయం ఒక్కొక్కసారి ఒక్కొక్కరకంగా ఉంటుందని.. వారి అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యంలో గౌరవించాలని అన్నారు. తన పార్టీకి 10 స్థానాలే వచ్చినా.. అసెంబ్లీని బాయ్ కాట్ చేసేవారం కాదని.. పది మంది ఐదేళ్లు ప్రజల కోసం పోరాటం చేసేవారని.. పనిచేసేవారని అన్నారు.
కానీ, ఏపీలో 11 మంది ఎమ్మెల్యేలే గెలవడంతో జగన్ అసెంబ్లీని బాయికాట్ చేసిన విషయం తెలిసిందే. పైకి ఆయన తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెబుతున్నా.. మనసులో మాత్రం.. తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని.. ప్రజల తీర్పు సరిగా లేదన్న ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమం లోనే జగన్ సొంత పార్టీ నాయకులను అసెంబ్లీకి పంపకుండా తానుకూడా రాకుండా బాయికాట్ చేశారు. కానీ.. సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్ మాత్రం 10 మందే గెలిచినా అసెంబ్లీని వదిలి పెట్టే వాళ్లం కాదని అనడం గమనార్హం.