ఏపీలో వైసీపీ అరాచక పాలనకు తెరపడి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఆ సభలో ప్రసంగించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం కాదు.. బాధ్యత కోసం ఏర్పడిన కూటమి తమదని పవన్ అన్నారు.
తమ కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు, కూటమి కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు కేవలం ఒక ప్రభుత్వాన్ని మార్చడానికి కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సరికొత్త దిశను నిర్దేశించిన తీర్పు అదని అన్నారు. ఏపీ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం కృషి చేస్తున్నామని చెప్పారు.
రెండేళ్ల క్రితం ప్రజలు తమకు అధికారంతోపాటు రాష్ట్ర భవిష్యత్తు అనే పెద్ద బాధ్యతను తమ భుజాలపై పెట్టారని అన్నారు. వైసీపీ అహంకారానికి, విధ్వంసకర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితం అని చెప్పారు.