ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన మహిళలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కానుకను అందించేందుకు సిద్ధమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ, అండ కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను(Widow Pension) మంజూరు చేయనున్నట్లు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ నూతన పింఛన్ల పంపిణీకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి, అర్హులైన ప్రతి మహిళ ఖాతాలోకి నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా అందించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో సంక్షేమ రంగంలో పెన్షన్ల పంపిణీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62.34 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్ల ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా ఏకంగా రూ. 33 వేల కోట్లను కేటాయిస్తోంది. భారతదేశంలోనే సామాజిక పింఛన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ప్రభుత్వం గర్వంగా చెప్తోంది.
పెన్షన్(AP Pensions) పొందుతున్న భర్త అకాల మరణం చెందితే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్పౌజ్ కేటగిరీ' విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. భర్త చనిపోయిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ పింఛను భార్య పేరిట బదిలీ అవుతోంది. ఈ మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 2.45 లక్షల మంది మహిళలకు తక్షణ ఆర్థిక భరోసా లభించింది.
కాగా, గత ప్రభుత్వం ఏకంగా 9.56 లక్షల పింఛన్లను తొలగించి పేదలను ఇబ్బంది పెడితే, మేము కేవలం నిబంధనల ప్రకారం అర్హత లేని 7,856 పెన్షన్లను మాత్రమే పక్కన పెట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) గర్వంగా పేర్కొన్నారు. ఇక పింఛన్ల కోతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పింఛన్లను ఎక్కడా రద్దు చేయలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికి కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయంతో రానున్న రోజుల్లో మరికొంతమంది పేద మహిళల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.