ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అది కూడా.. జగన్ ఇంటికి దగ్గరలోనే కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉన్నానని.. ఎవరైనా తనతో ఈ విషయంపై చర్చకు వచ్చే ధైర్యం ఉంటే రావొచ్చని సవాల్ రువ్వారు.
మెగా డీఎస్సీ-2025ని అత్యంత పకడ్బందీగా నిర్వహించామని.. దీనిలో ఒక్క ఆరోపణ కూడా రాలేదని లోకేష్ చెప్పారు. అయినా.. ఆరోపణలు చేస్తు్న్నారని విమర్శించారు. ఆరోపణలు చేసి వెళ్లిపోవడం కాదని.. వాటిని నిరూపించాలని సవాల్ రువ్వారు. తాను ఇక్కడే ఉన్నానని.. ఎవరు వచ్చినా సమాధానం చెబుతానని అన్నారు. మంగళగిరిలో పర్యటించిన నారా లోకేష్.. కీలకమైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు.
అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఒక్కసారైనా డీఎస్పీ నిర్వహించారా? అని ప్రశ్నిం చారు. ఒక్కసారైనా డీఎస్సీ నిర్వహించి ఉంటే.. హారిజాంటల్ రిజర్వేషన్కు.. సాధారణ రిజర్వేషన్కు తేడా తెలిసి ఉండేదని వ్యాఖ్యానించారు. కానీ, ఒక్కసారి కూడా నిర్వహించలేదన్నారు. అలాగే.. జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. తాము గొడ్డలి పార్టీ నాయకుల మాదిరిగా కాదన్నారు. ఇక్కడే ఉన్నానని.. ఎలాంటి విషయంపైనైనా చర్చకు సిద్ధమేనని చెప్పారు.
బెంతాహై వీడితేనే..
రాష్ట్రంలో గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందన్న విషయం తెలుసుకోవాలంటే.. బెంగళూరు-తాడేపల్లి-హైదరాబాద్ టూర్లు ఆపేసి..చూస్తే.. తెలుస్తుందని జగన్కు లోకేష్ చురకలు అంటించారు. ``ప్రిజనరీ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారు`` అని ఎద్దేవా చేశారు. ఇక, హొం మంత్రి అనితపై వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి.. `` కోడిగుడ్డుకు.. పరిశ్రమకు.. తేడా తెలియని వాళ్లు మంత్రులుగా చేయబట్టే పరిశ్రమలు పారిపోయాయి`` అని వ్యాఖ్యానించారు.