అమెరికా-ఇరాన్(Iran) మధ్య గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. ఏకంగా 108 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటానికి తాజా శాంతి ఒప్పందంతో తెరపడింది. ఇరు దేశాల సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగిపోయింది, సైనికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, యుద్ధం ముగిసినా దాని వల్ల జరిగిన నష్టం మాత్రం అంత సులువుగా ముగిసేలా లేదు. ముఖ్యంగా ప్రపంచ పెద్దన్న అమెరికాపై ఈ 108 రోజుల యుద్ధం ఊహించని స్థాయిలో ఆర్థిక భారాన్ని మోపినట్లు అంతర్జాతీయ నిపుణుల లెక్కలు చెబుతున్నాయి.
పెంటగాన్ విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. కేవలం సైనిక చర్యల కోసమే అమెరికా(United States Department of Defense) రక్షణ శాఖ ఏకంగా 113 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ.10.67 లక్షల కోట్లు. యుద్ధ రంగంలో శత్రువులపై ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులు, అత్యాధునిక మందుగుండు సామగ్రి, రాత్రికి రాత్రే సరిహద్దులకు వేలాది మంది సైనికులను తరలించడం (మిలిటరీ డిప్లాయ్మెంట్) వంటి వాటికే ఈ నిధులన్నీ కరిగిపోయాయి.
అయితే, ఈ నష్టం కేవలం యుద్ధ రంగానికే పరిమితం కాలేదు. దీని ప్రభావం నేరుగా అమెరికాలోని సామాన్య పౌరుడి జేబుపై పడింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా దూసుకుపోవడంతో, అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ప్రత్యక్ష, పరోక్ష నష్టాలను గనుక లెక్కిస్తే అమెరికా(America)కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం 630 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు) వరకు ఉండవచ్చని తెలుస్తోంది. యుద్ధం అధికారికంగా ముగిసినప్పటికీ, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా కోలుకోవడానికి మరికొన్ని ఏళ్లు పట్టేలా ఉందనేది ఆర్థిక నిపుణుల మాట.