ఆంధ్రప్రదేశ్లో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం మరో కీలక అడుగు వేసింది. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) కుమారుడు కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో సునీల్ను అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను నేరుగా ఈడీ జోనల్ కార్యాలయానికి తరలించారు.
మద్యం రవాణా టెండర్లలో జరిగిన అక్రమాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై గత కొన్ని రోజులుగా ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లోని కారుమూరి నివాసంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో లభించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన తర్వాత, ఈ కేసులో సునీల్ పాత్రపై స్పష్టత రావడంతోనే ఈడీ(ED) అధికారులు అరెస్ట్ దాకా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ భారీ మద్యం రవాణా కుంభకోణంలో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ స్కామ్కు వెనుక ఉండి కథ నడిపించిన ప్రధాన సూత్రధారి రాజ్ కెసిరెడ్డితో పాటు, ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. తాజాగా వైకాపా మాజీ మంత్రి వారసుడు, గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్( Karumuri Sunil Kumar) కూడా అరెస్ట్ కావడంతో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో మున్ముందు ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.