ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లు పలు తీర్మానాలకు ఆమోదం లభించింది. అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది.
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సిఫారసు చేసిన పలు ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.39,355 కోట్ల పెట్టుబడులతో, 34,610 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ కోసం గతంలో టాబ్ బ్రీడ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 35,000 టన్నుల సామర్థ్యంతో కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ రైతులకు కేటాయించిన ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలిపింది.