తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కొత్తగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జోసెఫ్ విజయ్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తూ ఒక సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి ఆడ, మగ శిశువుకు 'మేనమామ తరఫున కానుకగా' ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించే సరికొత్త ప్రజాకర్షక పథకాన్ని ఆయన ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం ఏకంగా రూ.755.83 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఆర్థిక నిపుణులలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ పథకం వెనుక ఉన్న అసలు వైరుధ్యం విజయ్(CM Vijay) చేసిన తొలి ప్రసంగంలోనే స్పష్టమైంది. గత డీఎంకే ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని విజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మరి అలాంటప్పుడు, ఖజానాపై వందల కోట్ల అదనపు భారాన్ని మోపే ఇలాంటి ఉచిత పథకాలను ఆయనే స్వయంగా ఎలా ప్రవేశపెడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిరుపేద కుటుంబాలకు మేనమామగా మారి, తమిళ సంప్రదాయాన్ని కాపాడటం కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం గర్వంగా చెప్తున్నప్పటికీ.. ఈ భారీ నిధులను ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు, నిరుపేద మహిళల శాశ్వత ఆర్థికాభివృద్ధికి ఉపయోగించి ఉంటే మరింత నిర్మాణాత్మకమైన మార్పు వచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, ఈ పథకం నేరుగా కేంద్ర ప్రభుత్వ విధానాలతో విభేదించేలా ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. దేశంలో విదేశీ మారక నిల్వలు కరిగిపోకుండా కాపాడుకోవడానికి, కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని లేదా మానుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, ఒక రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బంగారం ఆధారిత సంక్షేమ పథకాన్ని తీసుకురావడం.. ప్రధాని మోదీ(PM Modi) పిలుపును లెక్కచేయనట్లేననే చర్చ నడుస్తోంది. ప్రజల మనసులు గెలుచుకోవడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ, యువ సీఎం విజయ్ ఇలాంటి సంప్రదాయేతర ఉచిత పథకం వైపు మొగ్గు చూపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.