దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సరికొత్త రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో త్వరలోనే ఊహించని భారీ కుదుపు చోటుచేసుకోబోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) తన మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 28 లేదా 29 తేదీల్లోనే నయా కేబినెట్ కొలువుదీరబోతోందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ కావడం, ప్రమాణ స్వీకార తేదీలపై చర్చించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఈ పునర్వ్యవస్థీకరణలో అందరినీ ఆశ్చర్యపరిచే అతిపెద్ద మార్పు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు సంబంధించినదేనని టాక్. గత కొన్నేళ్లుగా దేశ ఆర్థిక రథాన్ని నడిపిస్తున్న ఆమెను ఆ శాఖ నుంచి తప్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెను పూర్తిగా పక్కన పెట్టకుండా, విద్యాశాఖ వంటి మరో కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.
అయితే నిర్మలా సీతారామన్ను ఆర్థిక శాఖ నుంచి బదిలీ చేస్తే.. ఆ స్థానంలోకి ఎవరొస్తారు అనే ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ను కేబినెట్లోకి తీసుకొచ్చి, ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనతో పాటు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాఘవ్ చద్దా(Raghav Chadha) కూడా ఈసారి మోదీ టీమ్లో చేరబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. యువత ఓట్ బ్యాంక్ను, ముఖ్యంగా 'జెన్ జీ' (Gen Z) ఆశయాలను ఆకట్టుకునేలా కేబినెట్ను సరికొత్తగా ముస్తాబు చేయడమే మోదీ నయా ప్లాన్ అని అర్థమవుతోంది.