తమ పార్టీ విధానాలను నిలదీసిన వారిని టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన కామెంట్లు చేయడం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అలవాటేనని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను వారి కుటుంబ సభ్యులను విమర్శించిన కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చట్ట ప్రకారం కేసులో నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే వారిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ నేతలు గతంలో గగ్గోలు పెట్టారు.
అరెస్టులు చేసినా సరే ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల తీరు మారలేదు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూతురిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్న వైసీపీ కార్యకర్తలకు తాజాగా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వాక్ స్వాతంత్ర్యానికి పరిమితులుంటాయని, రాజకీయాల పరంగా విమర్శిస్తే సహిస్తామని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించబోమని పవన్ హెచ్చరించారు.
ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడే వారిపై ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేయబోతున్నామని పవన్ అన్నారు.