ఏపీ రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు ట్రోలింగ్ కు గురవుతున్న సంగతి తెలిసిందే. మావిగన్ పై ట్రోలింగ్ జరుగుతుండగానే అసలు రాజధాని విజయవాడ అంటూ జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు మావిగన్ పై జగన్ అసెంబ్లీలో మాట్లాడాలని ఆయన ఛాలెంజ్ చేశారు. అంతేగానీ, బయట ప్రెస్ మీట్ లు పెట్టడం సరికాదని హితవు పలికారు. రుషికొండ భవనాలను ప్రజలందరికీ ఉపయోగపడేలా వినియోగించాలని ప్రభుత్వానికి సూచించారు. 'సర్' పేరుతో ఎవరి ఓట్లు తొలగించడం లేదని జగన్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రకటించిన తర్వాత మావిగన్ అంటూ జగన్ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. 2016 లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అసెంబ్లీలో మద్దతిచ్చిన జగన్... 2019లో అధికారంలోకి రాగానే 3 రాజధానులని మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత కూడా జగన్ రాజకీయ కుట్రలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.