సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'రా ఎన్టీఆర్' (RAW NTR) వ్యవహారంలో ఆఖరికి ఊహించని క్లైమాక్స్ నడిచింది. నందమూరి అభిమానుల పేరిట విపరీతమైన హడావుడి చేస్తూ, వంద కోట్ల బడ్జెట్తో ‘ఊరు-వాడ’ పేరుతో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రచ్చ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు అనూహ్యంగా తమ కార్యకలాపాలకు ముగింపు పలికింది. "విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు" అంటూ ఒక రకమైన వ్యంగ్యమైన కామెంట్తో ఎక్స్ (ట్విటర్) వేదికగా దుకాణం సర్దేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది.
అసలు కథేంటంటే.. తమిళ నటుడు విజయ్(Vijay) పొలిటికల్ ఎంట్రీకి ముందు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్ చేసిన హంగామా తరహాలోనే, ఈ ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రతినిధి సాయి రూప్ కూడా హడావుడి మొదలుపెట్టారు. 40 వేల మంది వాలంటీర్లతో రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందిస్తామంటూ హైదరాబాద్, తిరుపతిలలో ప్రెస్ మీట్లు పెట్టి హంగామా సృష్టించారు. దీనిపై కథనాలు రావడంతో ఎన్టీఆర్ పొలిటికల్ స్కెచ్ ఏమైనా ఉందా అనే చర్చ నడిచింది. అయితే, ఈ సీన్కి చెక్ పెడుతూ తారక్ పీఆర్ టీమ్ వెంటనే అలర్ట్ అయింది. ఈ ‘రా ఎన్టీఆర్’ సంస్థతో జూనియర్ ఎన్టీఆర్కు గానీ, ఆయన అధికారిక ఫ్యాన్స్ క్లబ్స్కు గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేసింది.

తీవ్ర వ్యతిరేకత వచ్చినా తగ్గేదే లేదన్నట్లు ప్రవర్తించిన సంస్థ ప్రతినిధి సాయి రూప్.. “ఎన్టీఆర్ చెప్పినా మేము ఆగం, మా సేవలు ఆపం” అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు నందమూరి అభిమానుల(Nandamuri Fans)కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. హీరో ఇమేజ్ను వాడుకుని సొంత పబ్లిసిటీ చేసుకుంటున్నారని, వంద కోట్ల నిధుల వెనుక అసలు కథేంటని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వైపుల నుంచి ప్రెజర్ పెరగడం, తారక్(Tarak) టీమ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో.. ఇక పప్పులు ఉడకవని అర్థం చేసుకున్న ఈ సంస్థ సైలెంట్గా బోర్డు తిప్పేసింది.
సేవా కార్యక్రమాలు ఆపేయడానికి నిర్దిష్ట కారణాలు వెల్లడించకపోయినా, ఎన్టీఆర్(NTR) ఇమేజ్కు డ్యామేజ్ కాకుండా ఫ్యాన్స్ చూపించిన పవర్, రీసెంట్గా తలెత్తిన నిధుల ప్రశ్నలే దీనికి ప్రధాన కారణమని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్లో హడావుడి చేసి, ఆఖరికి ఫ్లాప్ సినిమా ఉదాహరణలా ‘రా ఎన్టీఆర్’ సైలెంట్గా వెనక్కి తగ్గడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.