ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. తరతరాలుగా మన సంస్కృతిని, సంప్రదాయాలను తమ చేనేత మగ్గాలపై నడిపిస్తూ, ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మగ్గం నమ్మే ప్రతి పేద కుటుంబానికి కొండంత అండగా నిలిచేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నేతన్నల సంక్షేమానికి సంబంధించిన నేతన్న భరోసా(Nethanna Bharosa) పథకం అమలుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉంటూ, 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న చేనేత కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. సొంతంగా మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థిక ఊరటనిచ్చేందుకు వార్షిక సాయాన్ని ఖరారు చేసింది.
అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 25,000 ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నిధులు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ కానున్నాయి. నేతన్నల((Nethanna) శ్రమకు తగిన గుర్తింపునిస్తూ జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) రోజున ఈ ఆర్థిక సహాయ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, నేత కార్మికుల కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.