`నీట్` ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ తరపున ఉద్యమించిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్.. తన సుదీర్ఘ ఆమరణ దీక్షను గురువారం అర్ధరాత్రి విరమించారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తున్న ఆయన.. కేంద్ర మంత్రులు.. జితేంద్ర సింగ్, జేపీ నడ్డాల సమక్షంలో తన దీక్షను విరమించారు. చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం దీనిపై స్పందించిన నేపథ్యంలో ఆయన దీక్షను విరమించారు.
పక్కా ఆధారాలు తీసుకుని..
అయితే.. వాంగ్ చుక్ తన దీక్షను విరమించేందుకు ఆషామాషీగా మాటలతో పనిచేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పక్కా ఆధారాలను తీసుకుని, లిఖిత పూర్వక హామీలను తీసుకున్న తర్వాతే.. ఆయన దీక్షను విరమించడం గమనార్హం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. కేంద్రం నుంచి తీసుకువ చ్చిన లిఖిత పూర్వక హామీలను ఆసుపత్రిలో కొద్ది మంది సమక్షంలో చదివి వాంగ్ చుక్కు వినిపించారు. అనంతరమే.. సోనమ్ దీక్షను విరమించారు. అంతేకాదు.. ఈ ప్రక్రియను మొత్తాన్నీ ఆయన స్వయంగా వీడియో రికార్డింగు చేయించారు. అనంతరం.. దీనిని దేశ ప్రజలకు విడుదల చేశారు.
కేంద్రం స్పందన ఇదీ..
1) నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
2) జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టం.
3) ఆందోళన కారులపై లాఠీ చార్జీకి దిగిన అధికారులపై చర్యలు తీసుకుంటాం.
4) భవిష్యత్తులో పేపర్ లీక్ ఘటనలు జరగకుండా పక్కా జాగ్రత్తలు తీసుకుంటాం.
5) కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్చించి పార్లమెంటులో ప్రవేశ పెడతాం.
6) దీక్షను కొనసాగిస్తే.. దేశవ్యాప్తంగా విధ్వంసాలు జరిగే అవకాశం ఉంది. ఇది జాతీయ ప్రయోజనాలకు దేశానికి కూడా మంచిది కాదు.
7) చట్ట ప్రకారం.. నిందితులను(పేపర్ లీక్ బాధ్యులు) కఠినంగా శిక్షిస్తాం.
8) ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ఇప్పటికే ఆదేశించారు.
9) దేశ ప్రజల శాంతి భద్రతలు.. జాతీయ సమైక్యత కోసం.. సోనమ్ వాంగ్ చుక్ వంటి వారు మరింతగా సహకరించాలి. దీక్షను విరమించాలి.
10) నీట్ పేపర్ లీక్కు సంబంధించి అన్ని పక్షాలతోనూ చర్చిస్తాం. సమగ్ర చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
స్వాగతించిన కాక్రోచ్...
సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ఈ యవసులో(60) వాంగ్ చుక్.. దేశ యువత కోసం ఎంతో దైర్య సాహసాలు ప్రదర్శించి.. దీక్షకు దిగడం.. మంచి పరిణామమే అయినా.. ఇలాంటి వారు ప్రాణ త్యాగాలు చేసుకోవడాన్ని యువత సైతం సహించదని పేర్కొన్నారు. ఆయన దీక్ష విరమణ చేయాలని తాము గతంలోనూ సూచించామని దీప్కే పేర్కొన్నారు.
దీనికి ముందు..
దీనికి ముందు గురువారం మధ్యాహ్నమే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వాంగ్ చుక్కు లిఖిత పూర్వక సందేశం పంపించారు. తక్షణమే దీక్షను విరమించాలని సూచించారు. దేశ ప్రయోజనాలు, విద్యార్థుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందని పేర్కొన్నారు. దేశానికి మరింత సేవ చేసేందుకు వాంగ్ చుక్ వంటి వారు అత్యంత ముఖ్యులని.. ఆయన ఆరోగ్యం మెరుగు పడాలని.. ప్రధాని ఆకాంక్షించారు.