ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే తరుణం ఆసన్నమైంది. ఉత్తరాంధ్ర మణిహారంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ చారిత్రక వేడుక కోసం అధికారులు, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు రూ. 17,883 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
ఆగస్టు 1న జరగనున్న ఈ వైభవ్పేత ప్రారంభోత్సవ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. అలాగే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా దగ్గరుండి మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని సభకు భారీగా జనం తరలిరానుండటంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

సంప్రదాయ కళలకు పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ వేడుకలో భాగంగా, 13 వేల మంది గిరిజన బాలికలు, మహిళలతో భారీ స్థాయిలో దింసా(Dhimsa) నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అలాగే, ప్రధాని టెర్మినల్ భవనానికి చేరుకునే సమయంలో 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన రిహార్సల్స్ అన్నీ పూర్తయ్యాయి. దారి పొడవునా స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీ బోర్డులతో భోగాపురం ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
భద్రతాపరంగా కఠిన చర్యలు చేపట్టారు. భోగాపురం((Bhogapuram) విమానాశ్రయాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా, ముందుస్తు భద్రతా చర్యల్లో భాగంగా 48 గంటల పాటు భోగాపురాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. విశాఖ, విజయనగరం జిల్లాలలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు మరియు మల్లింపులు చేపట్టారు. ప్రయాణికులు, ప్రజల సౌకర్యార్థం ఎయిర్పోర్ట్ కు వెళ్లే అన్ని మార్గాలను అనుసంధానించడంతో పాటు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. సభకు వచ్చే జనాల రద్దీని నియంత్రించేందుకు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.
