నకిలీ పత్రాలు సృష్టించి..జీవించి ఉన్న వ్యక్తిని చనిపోయినట్టుగా చూపించి, అతని భూమిని కాజేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సీనియర్నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్.. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ పోలీసుల ముందు లొంగిపోయారు. గత వారం రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్న నాగ్.. సోమవారం అనూహ్యంగా పోలీసుల ముందు లొంగి పోవడం గమనార్హం. ఇక్కడ మరో చిత్రమైన ఘటన జరిగింది. ఆయన లొంగిపోవడానికి గంట ముందే.. స్థానిక కోర్టు నాగ్కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వెంటనే పోలీసులు ఆయనతో సంతకాలు తీసుకుని వదిలి పెట్టారు.
పోలీసులపై అనుమానం!
తమ్మినేని ఫ్యామిలీ విషయంలో స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీనాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు.. పట్టుకోలేక పోవడం, తర్వాత బెయిల్ తెచ్చకునే వరకు వేచి ఉండడం వంటివాటి వెనుక అస్మదీయ అధికారులే చక్రం తిప్పుతున్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఎడాప్ట్ చేసుకున్న పోలీసులు.. చిటెకెలో నేరాలను అరికట్టేలా, నేరస్తులను పట్టుకునేలా ప్రభుత్వం గత నాలుగు మాసాలుగా శిక్షణ కూడా ఇస్తోంది. అలాంటిది.. జిల్లాలోనే ఉండి.. అజ్ఞాతంలో ఉన్నామని ప్రకటించుకున్న తమ్మినేని ఫ్యామిలీని ఎందుకు అరెస్టు చేయలేక పోయారన్నది టీడీపీనేతలు సంధిస్తున్న ప్రశ్న.
తమ్మినేని దంపతులు.. కూడా
ఈ కేసులోతమ్మినేని దంపతులపై కూడా బాధిత వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే.. కేసునమోదు కాగానే ఈ ఫ్యామిలీ ప్రైవేటు కారులో ఉడాయించిందని టీడీపీనాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనికిసంబంధించి వారం రోజుల పాటు వెతుకు తున్నాం.. అని ప్రకటించిన ఫోలీసులు వారంతట వారు స్టేషన్కు వచ్చే వరకు గుర్తించలేక పోవడం గమనార్హం. అంతేకాదు.. వారు హైకోర్టుకు వెళ్లే వరకు కూడా వేచి చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసుల పనితీరుపై ప్రభుత్వం సమీక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మహిళా ఎస్సై కేసులో కూడా..
ఇక, జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మహిళా ఎస్సై ప్రవల్లికను వైసీపీ కార్యకర్తలు.. వేధించారన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు..వైసీపీ ఆముదాల వలస ఇంచార్జ్ చింతాడ రవికుమార్ను ఏ1గా నమోదు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఆయనను కూడా అరెస్టు చేయలేకపోయారు. పైగా.. చింతాడ పోలీసులకే సవాల్ రువ్వుతూ.. సెల్ఫీ వీడియో విడుదల చేయడం మరింత సంచలనంగా మారింది. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవాలని.. కానీ, తన అనుచరులపై మాత్రం కేసులు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. తాను శ్రీకాకుళం సరిహద్దుల్లోనే ఉన్నానని ఎక్కడికీ పారిపోలేదని కూడా చెప్పారు. ఇది జరిగి రెండు రోజులు అవుతున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, ఈ పరిణామాల నేపథ్యంలో తమ్మినేని సీతారాం వైసీపీకి గుడ్ బై చెబుతారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.