కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాజాగా సంచలన ప్రకటన చేశారు. తమ బొద్దింకల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తామని చెప్పారు. ఎక్కడ సమస్య ఉంటే.. ఎక్కడ విద్యార్థులకు ఇబ్బందులు వుంటే.. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పారు. అయితే.. కొందరు తమను రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నట్టు వెల్లడించారు. తమకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని దీప్కే చెప్పారు. అయితే.. తమ ప్రయాణంలో నేతలను కలుపుకొని పోయే అంశాన్ని పరిశీలిస్తామ న్నారు.
గత రెండు రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం మహారాష్ట్రలోని దీప్కే నివాసంలోనే జరుగుతోంది. ఈ సందర్భంగా సుమారు 60 మంది కీలక వాలంటీర్లు.. సీజేపీ వ్యూహకర్తలను ఆయన ఆహ్వానించారు. కీలక నిర్ణయాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు కూడగట్టనున్నట్టు చెప్పారు. దీనిని ప్రజా ఉద్యమాలుగా, విద్యార్థుల ఉద్యమాలుగా ముందుకు తీసుకు వెళ్లనున్నట్టు తెలిపా రు. రాజకీయంగా మాత్రం అడుగులు వేయబోమని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం జార్ఖండ్లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి తాము మద్దతు ఇవ్వనున్నట్టు దీప్కే చెప్పా రు. దీనిపై విమర్శలు చేసేవారు.. ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తాము ఢిల్లీలో చేపట్టిన ఉద్యమం తాలూకు ఫలితం సగమే దక్కిందని.. ఇంకా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందలేదని చెప్పారు. అలానే జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా వెనక్కి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వీటిని పూర్తిగా సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు.
యువత మాట వింటాం!
`లిజనింగ్ టూర్` - పేరుతో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ పర్యటించనున్నట్టు దీప్కే వెల్లడించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని యువత ఆకాంక్షలను వింటామని చెప్పారు. ప్రస్తుతం నిరుద్యోగం పెద్ద ఎత్తున విస్తరిస్తోందని.. చదువుకున్న యువతకు కనీసం 10 వేల రూపాయలు ఇచ్చే ఉద్యోగాలను కూడా ప్రభుత్వాలు కల్పించలేక పోతున్నాయని దీప్కే ఆరోపించారు. ఇలాంటి సమస్యలపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. యువతను కలుపుకొని భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపొందించనున్నట్టు వెల్లడించారు.