ఏపీ కేబినెట్లో ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇక జనసేనలో కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. గతేడాది పవన్ సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేసి కేబినెట్లోకి తీసుకుంటున్నామని స్వయంగా చంద్రబాబు నుంచే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇంతలో ఏం జరిగిందో గాని ఈ ప్రతిపాదన సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే పవన్ ఉప ముఖ్యమంత్రి.. మళ్లీ అదే ఫ్యామిలీ నుంచి నాగబాబును ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తే తీవ్ర విమర్శలు వస్తాయన్న చర్చలు జనసేన వర్గాల్లో జరిగాయి. పైగా కందుల దుర్గేష్ కూడా కాపు వర్గానికే చెందిన నేత.
జనసేనకు ఇచ్చిన నాలుగు పదవుల్లో మూడు ఒకే వర్గానికి కట్టబెడితే విమర్శలు వస్తాయనే పవన్ ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. అందుకే నాగబాబుకు అటవీశాఖకు చెందిన గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ పదవి కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేబినెట్ ర్యాంకుకు సంబంధించిన పదవి. సో ఈ లెక్కన నాగబాబు(Nagababu)కు మంత్రి పదవి ఇక లేదని.. ఈ కేబినెట్ పదవితో సర్దుకోమని చెప్పినట్లైంది. వాస్తవంగా కేబినెట్లో మొత్తం 25 బెర్త్లకు 24 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో మంత్రి పదవి ఖాళీ ఉంది. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇవ్వడంతో ఈ పదవి కూడా జనసేనకే ఇస్తారని అంటున్నారు.
అదే జరిగితే ఈ పదవి ఖచ్చితంగా బీసీలకు ఇస్తారని ఏపీ పొలిటికల్, ప్రభుత్వ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ఈ మంత్రి పదవి దక్కనుందట. కొణతాల గతంలో వైఎస్సార్(YSR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొణతాల మళ్లీ చట్ట సభలకు ఎన్నిక కాలేదు. తిరిగి 20 ఏళ్ల తర్వాత కొణతాల అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలవడం.. ఇప్పుడు మళ్లీ జనసేన కోటాలో ఆయన పేరు మంత్రి పదవి రేసులో ఉంది.
ఇక జనసేన(Janasena)లో ఇప్పటికే కమ్మ, కాపు నేతలు మంత్రులుగా ఉన్నారు. కొణతాలను తీసుకుంటే ఉత్తరాంధ్రలో బలమైన బీసీ వర్గాలకు ప్రాథినిత్యం దక్కినట్లవుతుంది. ఇక గోదావరి జిల్లాల నుంచి దుర్గేష్, పవన్ ఉంటారు. రాజధాని జిల్లాల నుంచి నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉంటారు. ఇప్పుడు కొణతాల ఎంట్రీతో ప్రాంతీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు బ్యాలెన్స్ చేసినట్లవుతుంది.