టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని పేరు. ఆ పేరుకు తగ్గట్లుగానే వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగానే ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే బీసీలకు సీఎం చంద్రబాబు మరో తీపి కబురు చెప్పారు. త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50 శాతం, ఇతర స్థానిక సంస్థల్లో 33.50 శాతం రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయాలని ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
ఆ తర్వాత ఈ రిజర్వేషన్ల అంశంపై శాసన సభలో జరిగిన చర్చలో సభాధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించారు. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చే చరిత్రాత్మక నిర్ణయం ఇది అని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీగా దీనిని చూడడం లేదని, ఇది టీడీపీ రాజకీయ సిద్ధాంతం అని అన్నారు. ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునే రోజు ఇదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు రాజ్యాధికారం కొన్ని వర్గాలకే పరిమితమైందని, అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు రాజకీయాలలో అధికారం దక్కే అవకాశం వచ్చిందని చెప్పారు.
1995లో బీసీలకు ఉన్న 20 శాతం రిజర్వేషన్లు 34 శాతానికి ఇప్పించిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. అయితే 2019లో వైసీపీ హయాంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జగన్ ద్రోహం చేశారని, 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. అంతేకాదు, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న నిర్ణయానికి కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, ఇకపై మున్సిపల్ ఛైర్మన్, మేయర్ లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఇప్పటి దాకా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం వల్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టడం వంటి సమస్యలు వస్తున్నాయి.