తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్గాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, ప్రభుత్వం, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన కీలక నాయకులపై అధిష్ఠానం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ(Konda Surekha)తో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డిలను వారి పదవుల నుంచి తొలిగించాలని క్రమశిక్షణ కమిటీ సంచలన సిఫారసు చేయడం హాట్ టాపిక్గా మారింది.
ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు, నేతల వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయని భావించిన క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ ఈ అంశంపై ఇప్పటికే సమగ్ర నివేదికను రూపొందించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కూడా ఈ రిపోర్టును సమర్పించి, తదుపరి చర్యలపై చర్చించేందుకు కసరత్తు వేగవంతం చేశారు.
ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే సహించేది లేదని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాల్సిందేనని కమిటీ తేల్చిచెప్పింది. అయితే, ఈ సిఫారసులపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఢిల్లీ(Delhi)లోని కాంగ్రెస్ హైకమాండే. ప్రస్తుతం గాంధీ భవన్ వర్గాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ పరిణామం తీవ్ర కలకలం రేపుతుండగా.. అధిష్ఠానం ఇచ్చే ముగింపుతో ఆ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందోనన్నది ఉత్కంఠగా మారింది.