వైఎస్సార్ కాంగ్రెస్(YSRCP) పార్టీలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. అయితే, ఇప్పుడు తెరవెనుక జరుగుతున్న పరిణామాలు కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కాకుండా, అత్యంత కీలకమైన నాయకుల మధ్య ఆధిపత్య పోరును బట్టబయలు చేస్తున్నాయి. సీనియర్ నేత విజయసాయిరెడ్డి విడుదల చేసిన సంచలన లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎపిసోడ్లో ఒకవైపు సాయిరెడ్డి నేరుగా సంధిస్తున్న అస్త్రాలు, మరోవైపు వాటిని తిప్పికొట్టేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వేస్తున్న ఎత్తుగడలు ఆసక్తికరంగా మారాయి.
తాజాగా సాయిరెడ్డి రాసిన రెండు పేజీల బహిరంగ లేఖలో ప్రధానంగా టార్గెట్ అయింది సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) మాత్రమే. పార్టీని, ప్రభుత్వాన్ని కొందరి కోటరీ ఎలా భ్రష్టు పట్టించింది, తనపై ఏవిధంగా భౌతిక దాడికి ప్రయత్నించారనే అంశాలను సాయిరెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించారు. చివరికి అధినేత జగన్మోహన్రెడ్డి సైతం ఆ కోటరీ గుప్పిట్లో బందీ అయ్యారనే తీవ్రమైన ఆరోపణలు అందులో ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.
తనపైకి వచ్చిన తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొనే ధైర్యం చేయకుండా, సజ్జల రామకృష్ణారెడ్డి అత్యవసరంగా మీడియా ముందుకు వచ్చి వ్యూహాత్మకంగా స్క్రిప్ట్ మార్చేశారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) లేఖ తనను ఉద్దేశించి కాదన్నట్లుగా, నేరుగా జగన్ను టార్గెట్ చేసేందుకే ఇదంతా జరుగుతోందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీలో నంబర్ వన్ జగనేనని, వెళ్లిపోయిన వాళ్లంతా ఆయనపై విమర్శలు చేయడం కొత్త కాదని చెప్పుకొచ్చారు.
ఇక్కడే అసలు మైండ్ గేమ్ అర్థమవుతుంది. సాయిరెడ్డి వేసిన ప్రతి అస్త్రం సజ్జలను గురిపెట్టినా, రామకృష్ణారెడ్డి మాత్రం ఆ దెబ్బను జగన్ ఖాతాలోకి మళ్లించేస్తున్నారు. తద్వారా తాను పూర్తిగా సేఫ్ అయిపోతూ, అన్ని విమర్శలను అధినేత భుజాల మీదకు నెట్టేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సజ్జల ఆడుతున్న ఈ సేఫ్ గేమ్లో అసలు బకరా అవుతున్నది జగనేనా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తన చుట్టూ ఉన్న కోటరీని సరిదిద్దాల్సిన సమయంలో, వారే ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండటం పార్టీకి ఏమేరకు మేలు చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. మరి ఈ పరిణామాలు వైసీపీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? సజ్జల వ్యూహాలను జగన్(Jagan) గ్రహించగలరా? అన్నది చూడాలి.