ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో తాజాగా వెలిగొండ ప్రాజెక్టు వచ్చి చేరింది. 4 జిల్లాలకు సాగు నీరుతో పాటు 4 లక్షల మంది దాహార్తిని తీర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పనులను సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కూటమి ప్రభుత్వం.. వడివడిగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాకాల సీజన్లోనే దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
సోమవారం ఉదయం.. పక్కా ముహూర్తం మేరకు సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు తొలిదశకు శ్రీకారం చుట్టారు. మార్కాపురం జిల్లాలోని సుంకేసుల సహా కడప జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసులకు తాగు నీరు అందనుంది. అలానే సాగునీటి సమస్య కూడా పరిష్కరించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు దాదాపు 30 ఏళ్ల సమయం పట్టింది. పలు ప్రభుత్వాలు వచ్చినా.. ఇక్కడ కీలకమైన.. సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తికి సుదీర్ఘ సమయం పట్టింది.
ఇక, వెలిగొండ ద్వారా 4 లక్షల మంది ప్రజలకు తాగు నీరు, 2 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కుళాయి ద్వారా నీటిని అందించనున్నారు. అదేసమయంలో 1.2 లక్షల ఎకరాలకు.. సాగునీటిని అందించను న్నారు. పైగా.. ప్రస్తుతం కరువు నేలగా పేర్కొనే ఉమ్మడి ప్రకాశంలోని మార్కాపురం, నెల్లూరులోని శివారు ప్రాంతాలు, కడప జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరు అందనుంది. ఫలితంగా.. రైతుల కష్టాలు తీరి.. వలసలు తగ్గుముఖం పట్టనున్నాయి.
మలిదశకు ఏర్పాట్లు
వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 53.85 టీఎంసీలు. అయితే.. ప్రస్తుతం పూర్తయింది.. తొలిదశ మాత్రమే. దీనిలో ఇప్పుడు 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన 33 టీఎంసీలను నిల్వ చేసుకునేందుకు ప్రాజెక్టును పూర్తిగా నిర్మించాల్సి ఉంది. అయితే.. ఈ నిర్మాణం కనీసం 4 నుంచి 5 సంవత్సరాల వరకు పట్టనుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆయా పనులపై కూడా కసరత్తు చేస్తున్నట్టు వివరించారు.