కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం, వికృతం కనిపిస్తోందని ఆరోపించారు. ఇది 1000 రోజుల పాలన కాదని.. ‘పీడన’ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి లేకుండా ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ.20 వేల కోట్లు మాత్రమే చేశారని, రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టారని గుర్తుచేశారు. కేసీఆర్ అన్నపూర్ణగా మార్చిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. ఢిల్లీకి మూటలు మోయడం, పదవుల కోసం కొట్లాడుకోవడం తప్ప మరేమీ లేదని చురకలంటించారు.
రైతు బంధు ఆపేసి రాహుల్ బంధుకు ప్రాధాన్యతనిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీ కార్యక్రమాలకు డబ్బులున్నాయని, కానీ, రైతులకు నీళ్లు ఇచ్చేందుకు డబ్బులు లేవని విమర్శలు గుప్పించారు.