మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే లోకేశ్ చేతుల మీదుగా గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ పిల్ గురు రాజా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ ఇది తన జీవితంలో మర్చిపోలేని క్షణం అని భావోద్వేగానికి లోనయ్యారు. తనతోపాటు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవి ఇచ్చిన టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్ లకు డాక్టర్ రాజా కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ మనుగడ కోసం ఎన్నారైలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, పార్టీకి అండగా నిలిచారని అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో ఎన్నారైల పాత్ర అమోఘం అని కొనియాడారు. కేవలం నిరసనలకు మాత్రమే పరిమితం కాకుండా సోషల్ మీడియా ద్వారా గత ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నవ్యాంధ్ర పునర్నిర్మాణం, చంద్రబాబు విజన్, లోకేశ్ నవ నాయకత్వానికి తోడుగా ఎన్నారైలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని డాక్టర్ రాజా పిలుపునిచ్చారు.
1983లో కర్నూలులో అన్న ఎన్టీఆర్ చైతన్య రథయాత్రలో పాల్గొనడంతో తన రాజకీయ ప్రస్థానం మొదలైందని డాక్టర్ రాజా గుర్తు చేసుకున్నారు. వృత్తి రీత్యా డాక్టర్ గా అమెరికా వెళ్లినా సరే..మనసు మాత్రం టీడీపీతోనే ఉందని ఆయన అన్నారు. ఎన్నారై టీడీపీని గ్లోబల్ శక్తిగా, ఏకతాటిపైకి తెచ్చేందుకు లోకేశ్ ఆలోచన అమోఘం అని ప్రశంసించారు. గ్లోబర్ ఎన్నారై టీడీపీ అధ్యక్ష పదవి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే గురుతర బాధ్యత అని డాక్టర్ గురు రాజా అన్నారు. కమిటీ సభ్యులంతా కలిసి టీడీపీని ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.
చంద్రబాబు చలవ వల్ల తెలుగు ప్రజలతో ఊళ్లకు ఊళ్లే విదేశాల్లో స్థిరపడ్డాయని, ఏ దేశంలో చూసినా సరే థ్యాంక్యూ సీబీఎన్... మీ వల్లే మేం విదేశాల్లో ఉన్నాం అని ప్రవాసాంధ్రులంతా అనుకుంటున్నారని ప్రశంసించారు. పార్టీ దేవాలయం..కార్యకర్తలే దేవుళ్లు అని లోకేశ్ నమ్మారని, సామాన్య కార్యకర్త మొదలు ఎన్నారైల వరకు కష్టపడే ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తున్న యువనేత లోకేశ్ అని కొనియాడారు. పార్టీకి కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారని, అటువంటి కార్యకర్తలకు మనం ఏమివ్వాలి అనే ఆలోచన చేసిన యువనేత లోకేశ్ అని అభినందించారు.
కుప్పంలో యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ వేసిన తొలి అడుగు తనకు ఇంకా గుర్తుందని డాక్టర్ రాజా అన్నారు. లోకేశ్ కు తాను, తమ మిత్రుడు కిలారు రాజేష్ తిలకం దిద్ది ఆ రోజు చెప్పిన మాటను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘శిలగా వెళ్తున్నావు...శిల్పంగా మారి రావాలి అని చెప్పాం...మీరేమో దేవతా మూర్తిగా భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఎదిగారు...ఇదేమైనా మామూలు శిల్పమా? కాదు కదా! నారా వారి మరియు నందమూరి వారి రక్తంతో తయారైన ఏకైక శిల్పం...ఈ శిల్పాన్ని చెక్కింది ఎవరనుకున్నారు? టీడీపీ కార్యకర్తలు, తెలుగు ప్రజలు...ఇట్స్ వన్ అండ్ ఓన్లీ పీస్ లోకేశ్... Sorry Lokesh Garu there is another piece(Nara Devansh) growing’’ అని లోకేశ్ పై డాక్టర్ రాజా ప్రశంసల జల్లు కురిపించారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనందరం పాలుపంచుకుందామని, జన్మభూమి రుణం తీర్చుకుందామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రులను రాష్ట్రాన్ని కలిపే వారధి ఎన్నారై టీడీపీ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలుంటే అందులోని 165 దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పారు. టీడీపీలో క్రియాశీలక సభ్యత్వాలు పెంచే దిశగా అడుగులు వేయబోతున్నామని తెలిపారు. ప్రతి ఎన్నారై కుటుంబం ఏపీలోని 15 కుటుంబాలను ప్రభావితం చేసేలా పనిచేయాలని, తద్వారా 50 లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేయవచ్చని దిశానిర్దేశం చేశారు.
మళ్లీ మళ్లీ....టీడీపీని గెలిపిస్తూనే ఉండాలని, ఆ టీడీపీయే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పారు తమ తమ దేశాలలోని తెలుగు ప్రజలకు గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు చేరువ కావాలని కోరారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, చంద్రబాబు చూపించిన అభివృద్ధి బాటలో..లోకేశ్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతామని చెప్పారు.