వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ లిక్కర్ స్కాం.. ఢిల్లీ లిక్కర్ ను మించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని అధికార పక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని అరెస్టు చేయగా..ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్నారు.
ఈ క్రమంలోనే మిథున్ రెడ్డిని 2 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. మిథున్ రెడ్డిని 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులో కోరారు. అయితే, కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ కేసు విచారణను మరింత లోతుగా జరిపేందుకు పోలీసులు మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు.
శుక్రవారం, శనివారం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారణ జరపనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరపనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మిథున్ రెడ్డి నుంచి రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఎవరు? అన్న విషయాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీయబోతున్నారు. ఈ రెండు రోజుల విచారణ తర్వాత ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు బట్టబయలయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది.