మార‌బోతున్న‌ ఏపీ మ్యాప్‌.. కొత్త జిల్లాల ఏర్పాటుకు మ‌రో బిగ్ స్టెప్‌!

admin
Published by Admin — November 28, 2025 in Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. పరిపాలనను మరింత సరళతరం చేయడం, ప్రజలకు సేవలను చేరువ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల ఏర్పాటుపై ముందడుగు వేసింది. తాజాగా విడుద‌లైన ప్ర‌ధామిక‌ నోటిఫికేషన్‌తో మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల స్థాపనకు బీజం పడింది. ఇందులో పోలవరం జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

కొత్త జిల్లాల ప్రకటనే కాదు, పరిపాలనా యంత్రాంగాన్ని పునర్‌వ్యవస్థీకరించేందుకు ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రతిపాదించారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, మదనపల్లె జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకిని ప్రత్యేక డివిజన్లుగా ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఈ మార్పులు మొత్తం పరిపాలనా వ్యవస్థపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.

జిల్లాల పునర్నిర్మాణంలో భాగంగా కొన్ని మండలాల బదిలీ కూడా ప్రధానంగా నిలిచింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చగా, కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేశారు. ఈ మార్పులు సంబంధిత ప్రాంతాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు నమోదు చేసుకునేందుకు 30 రోజుల గడువును ఇవ్వడం ప్రభుత్వం తీసుకున్న ప్రజా భాగస్వామ్య పద్ధతిని స్పష్టం చేస్తోంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఈ తాజా నోటిఫికేషన్ మరో కీలక మైలురాయిగా పరిగణించబడుతోంది. రాష్ట్ర విస్తీర్ణం పెరిగిన క్రమంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ మార్పులు కీలకమని అధికారులు భావిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్‌ను రూపొందించనున్నట్లు ప్రభుత్వం సూచించింది.

 
Tags
AP New Districts Andhra Pradesh Ap News Ap district reorganization AP new district list
Recent Comments
Leave a Comment

Related News