తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ెముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి...ఆ హామీని విస్మరించారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న ‘రైజింగ్ తెలంగాణ’ కార్యక్రమాన్ని కూడా కవిత ప్రస్తావించారు. పోరాటాల పురిటిగడ్డ అయిన ఓయూలో అడుగుపెడుతున్న రేవంత్ రెడ్డి...నిరుద్యోగ యువతకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఉత్తుత్తి మాటలు, జాబ్లెస్ క్యాలెండర్లకు కాలం చెల్లిందని, రైజింగ్ పేరుతో అబద్ధాలు చెప్పడం కాదని విమర్శించారు. యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.