వైసీపీ హయాంలో ఐదేళ్లు జగన్ వ్యవహరించిన విధానాలతో గ్రామీణ ప్రాంతాలు బిక్కుబిక్కుమన్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితిని ఇప్పుడు మారుస్తున్నామని.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ధైర్యంగా తలెత్తుకుని తిరిగేలా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు... గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్(గ్రామీణ్)- వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు.
తాజాగా శనివారం `జీ రామ్ జీ పథకం` అమలు పైనా... ఈ పథకం ద్వారా రాష్ట్రానికి... పేదలకు ఎలాంటి మేలు జరుగుందన్న అంశంపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని తెచ్చింది.`` అని తెలిపారు. గతంలో వైసీపీ హయాంలో ఉపాధి హామీ పథకంలో సొమ్ములను కూడా దోచుకున్నారని వ్యాఖ్యానించారు. గ్రామీణుల పొట్ట కొట్టారని.. అన్నారు. కానీ... కొత్త మార్గదర్శకాల ద్వారా ఆ తరహా పరిస్థితికి అవకాశం లేకుండా.. ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు.
గతానికంటే 25 రోజులు ఎక్కువగా పేదలకు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు.. రైతులకు, వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసేలా నిబంధనలు తెస్తున్నామన్నారు. దీని వల్ల అటు కూలీలకు.. ఇటు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. టీడీపీ హయాంలో మాత్రమే గ్రామాల్లో ఆస్తుల కల్పన జరిగిందన్న ఆయన.. వైసీపీ హయాంలో గ్రామీణుల ఆస్తులను దోచుకున్నారని.. విమర్శించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో గ్రామాల్లో ఆస్తుల కల్పన జరగకపోగా.. గ్రామీణులు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇప్పుడు గ్రామీణులు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం తాను కాకినాడలో పర్యటించినప్పుడు గ్రామీణులు పంచుకున్న అభిప్రాయాలను చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ హయాంలో తమ పొలాలను ఎక్కడ కాజేస్తారోనన్న భయంతో వారు అక్కడే రాత్రుళ్లు వంతులు వేసుకుని జాగారం చేశామని చెప్పినట్టు తెలిపారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామీణులకు అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.