రప్పా-రప్పా నరుకుతాం... గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిస్తాం.. అంటూ.. రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తల గురించి తెలిసిందే. గత నెలలో జగన్ పుట్టిన రోజు నాడు.. అన్నంత పనీ చేశారు. ఆయన ఫ్లెక్సీలకు.. పొట్టేళ్లను బలిచ్చి.. వాటి రక్తంతో అభిషేకం చేశారు. ఈ వ్యవహారం పెనుదుమారం అయింది. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. సదరు కార్యకర్తలను అరెస్టు చేసి.. జైలుకు పంపించారు.
అయినా.. కూడా ఇంకా రాష్ట్రంలో రప్పా-రప్పా డైలాగులు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణాజిల్లాలోని మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహించిన మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలుగా భావిస్తున్న యువకులు కొందరు రెచ్చిపోయారు. పూటుగా మందుకొట్టి.. అర్ధరాత్రి పెద్దపట్నం గ్రామంలో `రప్పా .. రప్పా.. నరుకుతాం` అంటూ కామెంట్లు చేస్తూ.. వీరంగం సృష్టించారు.
అంతేకాదు.. కేకును సాధారణంగా ఎవరైనా కత్తితో.. అది కూడా ప్లాస్టిక్ కత్తితో కోస్తారు. కానీ, ఈ మూక మా త్రం.. ఏకంగా.. పదునైన గొడ్డలి తెచ్చి.. దాంతో కేకును కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. ఇది కొంత మారుమూల ప్రాంతం కావడంతో ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది. అయితే.. ఇంత చేసిన కార్యకర్త లు.. దీనిని వీడియో తీసి.. వైరల్ చేశారు. దీంతో పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. వీరు వైసీపీ కార్యకర్తలని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
కానీ, వైసీపీ నాయకులు మాత్రం.. తమకు వారికి ఎలాంటి సంబంధం లేదని.. ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఘటన జనవరి 1వ తేదీ తెల్లవారుజామున జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన మచిలీపట్నంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. గొడ్డలితో కేక్ కట్ చేయడం ఏంట్రా బాబూ.. అందరూ బుగ్గలు నొక్కుకుంటున్నారు.