నవ్యాంధ్ర ప్రగతి కొత్త మలుపు తిరిగింది. ఐదేళ్లు రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసి.. తమను తరిమికొట్టిన జగన్ మళ్లీ వస్తాడేమోనని పారిశ్రామికవేత్తల్లో నిన్నమొన్నటి వరకు ఉన్న సందేహాలు పటాపంచలైపోయాయి. విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు రావడం.. ఆ తర్వాత విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో వందల కొద్దీ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఏకంగా అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడం రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చివేశాయి.
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం నుంచి పరారైన ఇండస్ట్రియలిస్టులు.. రాష్ట్రంలో టీడీపీ కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడారు. తిరిగి జగన్ వస్తే తమ పరిస్థితి ఏమిటన్న డోలాయమానంలో పడ్డారు. దీనికితోడు జగన్ బహిరంగంగానే పెట్టుబడిదారులను బెదిరించడం.. తానొస్తే రాజధాని అమరావతి నిర్మాణం ఆపేస్తానని.. పనులు తీసుకున్న కాంట్రాక్టర్లకు దమ్మిడీ ఇవ్వనని,, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి తీసుకున్న కాంట్రాక్టులు రద్దుచేస్తానని హెచ్చరించడంతో వారిలో భయాందోళనలు చెలరేగాయి.
ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ పార్టీ నేత.. ఇంత నిర్లజ్జగా, పాలెగాడి తరహాలో వ్యవహరించడం.. కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించకపోవడంతో పారిశ్రామికవేత్తలు సందిగ్ధంలో పడిపోయారు. అయితే జగన్ తీరుపై సామాజిక మాధ్యమాల్లో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. అటు తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా సైలెంటైపోయింది. కూటమి ప్రభుత్వానికి అండగా ప్రధాని మోదీ సైతం పదే పదే రాష్ట్రానికి వస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
దీనికితోడు పెట్టుబడిదారుల్లో నమ్మకం పాదుగొల్పేందుకు సీఎం చంద్రబాబు పరిశ్రమలకు రాయితీలను అప్పటికప్పుడే విడుదల చేస్తూ వస్తున్నారు. గూగుల్కు గానీ, బడా కంపెనీలకు గానీ ఎంవోయూలు కుదుర్చుకుని.. పత్రాలను మార్చుకున్న వెంటనే ప్రోత్సాహకాల జీవోలను చేతిలో పెడుతుండడంతో పారిశ్రామికవేత్తలకు కాస్త నమ్మకం చిక్కింది. ఇదే సమయంలో కేంద్ర నిఘా విభాగం (ఐబీ) ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో సర్వే ఫలితాలను మోదీకి అందించింది.
ఏపీలో జగన్పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను పక్కనపెడితే.. మద్యం కేసులో ఆయన నిండా కూరుకుపోయారని.. ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఇసుమంతైనా తగ్గకపోగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరింత ఘోరంగా దెబ్బతింటారని నివేదించింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆ వివరాలను సీఐఐ, భారీపారిశ్రామికవేత్తలకూ లీక్ చేసింది. అటు కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో పెట్టుబడిదారులు విశాఖ సదస్సుకు తరలివచ్చారు.
విధ్వంసం నుంచి వికాసం దిశగా..
జగన్ ఐదేళ్ల విధ్వంసంతో నవ్యాంధ్ర అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. అమర్రాజా, లులూ లాంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఉద్యోగాలంటే రూ.5వేల జీతంతో జీవితాలు వెళ్లదీసే వలంటీర్ పోస్టులేనని.. చేపలు, రొయ్యల దుకాణాలు పెట్టించడమే పరిశ్రమలకు జగన్ మార్కు ప్రోత్సాహమని తేలిప్వడంతో రాష్ట్ర యువత తీవ్ర నిరాశానిస్పృహల్లో మునిగిపోయింది. వైసీపీ విధ్వంస పాలనతో విసుగెత్తిపోయిన యువత, ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి అత్యంత అవమానకరంగా ఓడించారు.
చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయినా విధ్వంసం తాలూకా ఆనవాళ్లు రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. తొలి 15 నెలల్లో టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలు, ఆర్సెలార్ మిట్టల్ వంటి బహుళ జాతి సంస్థలు, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైనా అటు పారిశ్రామికవేత్తల్లో సందేహాలు అలాగే ఉండిపోయాయి. మళ్లీ జగన్ వస్తే మా పరిస్థితి ఏమిటని పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ కార్యరూపం దాలుస్తాయా అని ప్రజలు సందేహిస్తూ వచ్చారు.
ఇది ముందే ఊహించిన చంద్రబాబు.. ఓవైపు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారించే బాధ్యతను లోకేశ్కు అప్పగించారు. లోకేశ్ మొదటి నుంచీ ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ను తీసుకురావడంపైనే అధికంగా దృష్టిపెట్టారు. 13 నెలలు ఈ దిశగా కష్టపడ్డారు. గూగుల్ నాయకత్వాన్ని ఒప్పించగలిగారు.
విశాఖలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం.. వాల్స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సైతం గూగుల్ విశాఖ రాకపై పెద్ద ఎత్తున కథనాలు ఇవ్వడం.. ఆ వెంటనే కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పారిశ్రామికంగా సానుకూల వాతవరణం ఏర్పడింది. కర్నూలులో జరిగిన జీఎస్టీ సభలో సుమారు రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టడం ఏపీకి తిరుగులేదన్న భరోసా ఇచ్చింది.
గూగుల్పైనా విషమే..!
అభివృద్ధి పొడే గిట్టని వైసీపీ నాయకులు గూగుల్ డేటా సెంటర్పైనా విషం చిమ్మడం మొదలుపెట్టారు. డేటాసెంటర్ వల్ల వచ్చే అనర్ధాలను సామాజిక మాధ్యమాల వేదికగా వైసీపీ పర్యావరణవేత్తలు ఏకరవు పెడుతుంటే.. విశాఖకు గూగుల్ రావడంతో రాష్ట్రానికి ఒరిగేది శూన్యమని.. వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలు రావంటూ వైసీపీ మేధావులు తప్పుడు ప్రచారానికి తెరదీశారు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో మీడియా గూగుల్ విశాఖ పెట్టుబడులపై సవివరమైన కథనాలు ఇవ్వడం.. చంద్రబాబుకు ఉన్న హైటెక్ సిటీ అనుభవంతో వైసీపీ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయలోనూ విపక్షాలు.. కంప్యూటర్లు కూడు పెడుతాయా అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు అదే హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ నిపుణులు ఎంతమంది ఉన్నారో అంతకు వంద రెట్లు ప్రజలు వివిధ రకాల వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు.
గూగుల్ విషయంలోనూ అక్షరాలా అదే జరుగుతుందని ఏపీ ప్రజలు విశ్వసిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్తో ప్రత్యక్షంగా వచ్చే ఉద్యోగాల కన్నా అనుబంధంగా వచ్చే ఉద్యోగాలే కొన్ని వందల వేల రెట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏపీ దశ.. దిశను మార్చే కీలక ముందడుగుగా గూగుల్ డేటా సెంటర్ - ఏఐ హబ్ను పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. పైగా చందబ్రాబు గతంలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచుకునేలా చేయడంలో ‘గూగుల్’ ఒప్పందం విజయవంతమైంది.
అంతేకాదు.. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడుల తొలి ప్రతిపాదన రూ.87,520 కోట్లు మాత్రమే! దానికే జగన్ అండ్ కో కళ్లలో నిప్పులు పోసుకున్నారు. తీరా చంద్రబాబు, లోకేశ్ ఢిల్లీ వెళ్లి వారి ప్రతినిధులను కలిశాక పెట్టుబడిని 1.36 లక్షల కోట్లకు పెంచేశారు. రాష్ట్రానికే కాదు.. దేశంలోనే అతి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితిమీరిన సుంకాలతో భారత్పై గుడ్లురుముతున్న సమయంలోనే... అదే దేశానికి చెందిన ‘గూగుల్’ భారత్లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవడం ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ‘ఏఐ హబ్’ కూడా ఇదే! దీని ద్వారా భవిష్యత్లో 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. అంతేకాదు టెక్ కంపెనీలు విశాఖకు బారులు తీరతాయి. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న నగరం.. టెక్ హబ్గా ఆవిర్భవిస్తుంది.
విశాఖకు గూగుల్ ప్రతినిధులు
ఒప్పందం కుదుర్చుకోవడంతో లోకేశ్ సంతృప్తి చెందలేదు. కేటాయించిన భూములను వచ్చి చూసుకోవాలని గూగుల్ నాయకత్వానికి కబురంపారు. ఆ సంస్థ ప్రతినిధులు తక్షణమే రంగంలోకి దిగారు. డేటా సెంటర్లు ఏర్పాటుచేయదలచిన విశాఖ జిల్లా అడవివరం, తర్లువాడ, అనకాపల్లి జిల్లా రాంబిల్లిని సందర్శించారు. తొలుత తర్లువాడలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.
విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా భారత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ హబ్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య జరిగిన ఒప్పందంపై ప్రధానితో ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి హబ్ ఏర్పాటు విశేషాలను ఆయన మోదీకి వివరించారు.
ఈ సమాచారాన్ని పేర్కొంటూ సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్కు మోదీ స్పందించారు. ‘ఏపీలోని డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. బహుళ అంచెల పెట్టుబడితో కూడిన ఈ గిగావాట్ స్థాయి డేటా సెంటర్ వికసిత భారత్ను నిర్మించాలనే మా దార్శనికతకు అనుగుణంగా ఉంది. ఇది సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఒక శక్తిమంతమైన సాధనంగా ఉంటుంది. కృత్రిమ మేధను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలకు అత్యాధునిక సదుపాయాలను అందిస్తుంది. అలాగే, మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు.
విశాఖపై సుందర్ పిచాయ్కు ఎంత నమ్మకమో!
‘నేను దక్షిణాది రాష్ట్రాల్లో రైలులో ప్రయాణించేవాడిని. అక్కడ వైజాగ్ అనే నగరం ఉంది. సముద్ర తీరాన ఉన్న అందమైన నగరమది. బాగా అభివృద్ధి చెందుతోంది. విశాఖ కేంద్రంగా అమెరికా బయట అతిపెద్ద ఏఐ ఇన్వెస్ట్మెంట్ ప్రకటించాం. ఇది 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి! ఈ ప్రాజెక్టులో 80 శాతం హరిత ఇంధనం వినియోగిస్తాం. సముద్ర గర్భంలో కేబుల్స్ వస్తాయి. ఈస్థాయి పెట్టుబడితో ఆ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశముంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ఒక గొప్ప మైలురాయి’ అని ‘ఎక్స్’లో అభివర్ణించారు.
తెరపైకి జగన్ చేపలమార్కెట్
ఇక జగన్ సంగతే చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ను.. విశాఖకు దేశంలోనే అది పెద్ద గూగుల్ డేటా సెంటర్ను తీసుకురాగా.. 2019-24 మధ్య కాలంలో జగన్ ఏమేం పెట్టుబడులు తెచ్చారని ప్రజలు తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఆయన సీఎంగా ఉండగా... పులివెందులలో అట్టహాసంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. చేపల మార్కెట్ ప్రారంభించిన వైనం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ సందర్భంగా ‘పులివెందులకు ఫిష్ మార్కెట్ వస్తుందని ఎప్పుడైనా ఊహించామా’ అని ఆయన అన్నమాటలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. పులివెందులవాసులకు చేపలు, రొయ్యలంటే తెలియదని.. వాటిని తానే తొలిసారి తీసుకొచ్చినట్లుగా పోజు కొట్టడం చూసి ఆనాడే వారు నవ్వుకున్నారు. ఇదే సమయంలో ఆయన హయాంలో ఐటీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్
అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. 2022 మే నెలలో జగన్తో దావోస్ వెళ్లి ఏమేం పెట్టుబడులు తెచ్చారని అడిగితే.. ‘కోడి.. గుడ్డు పెండుతుంది. పిల్లలను పెట్టదు కదా! పిల్లలను పొదిగేందుకు సమయం పడుతుంది’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ వేదికగా అప్పడాల తయారీ, ఆలమండ మామిడితాండ్ర తయారీ, మసాలా తయారీ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నామంటూ అమర్నాథ్ చేసిన ప్రకటనా ఇప్పుడు తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు 2023 మార్చిలో జగన్ విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు.
కానీ అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులేవీ రాలేదు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో తయారయ్యే మామిడి తాండ్ర, అప్పడాలు, మసాలా దినుసుల తయారీ ఒప్పందాలు చేసుకున్నారు. విశాఖలో జరిగిన పెట్బుబడుల సదస్సులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సూట్లు.. బూట్లు వేసుకుని పారిశ్రామికవేత్తలుగా వేషం కట్టడం కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది.
జనవరి నుంచి కాగ్నిజెంట్!
ప్రముఖ ఐటీ కంపెనీ ‘కాగ్నిజెంట్’ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడలో 21.33 ఎకరాలు కేటాయించగా.. అందులో రూ.1,583 కోట్లతో అతిపెద్ద కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 8వేల మందికి దశల వారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాపులుప్పాడలో శాశ్వత భవన నిర్మాణం పూర్తికాకముందే జనవరిలో తాత్కాలిక భవనంలో డెలివరీ సెంటర్ ప్రారంభించబోతోంది.
దేశవ్యాప్తంగా కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీకి చెందిన కొందరిని విశాఖ తరలించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఆయా ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోడానికి సర్వే చేపట్టింది. పలువురు ఇందుకు సుముఖత తెలుపడంతో. డెలివరీ సెంటర్ను 800 మందితో మొదలుపెట్టాలని కాగ్నిజెంట్ భావిస్తోంది.