వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా అంబటి రాంబాబు చేసిన అరాచకం..చూపించిన అధికార దర్పం అంతా ఇంతా కాదు. నోటికి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబును దుర్భాషలాడడం వంటివి చేయడంతో అంబటికి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా సరే ఆయన తీరు మాత్రం మారలేదు. తాజాగా సీఎం చంద్రబాబుపై అంబటి బూతులతో రెచ్చిపోయిన వైనంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రమ్మను చూసుకుందాం అంటూ చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపి వైసీపీ మహాపాపం చేసిందని ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే, తమ తప్పు ఒప్పుకోని అంబటి రాంబాబు గుంటూరులోని గోరంట్ల సెంటర్ లో ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే అంబటి కాన్వాయ్ ను టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో, సీఎం చంద్రబాబుపై అంబటి నోరు పారేసుకున్నారు. రాయడానికి వీలు లేని అసభ్య పదజాలంతో చంద్రబాబును అంబటి దూషించారు. రమ్మను చూసుకుందాం అంటూ చంద్రబాబును దుర్భాషలాడారు.
ఇక, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పోలీసులను కూడా విమర్శించారు. ఈ క్రమంలోనే అంబటిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంబటి తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.