వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కూడా అయిన జోగి రమేష్, అంబటి రాంబాబు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబా బు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్లపై నోరు చేసుకున్న పరిణామాలు తీవ్రతరం అవుతున్నాయి. శనివారం రోజు రోజంతా.. అంబటి రాంబాబు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. సీఎం చంద్రబాబు మాతృమూర్తిపై చేసిన దారుణ వ్యాఖ్యలను ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అంబటిని నిలదీశారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళన కారులు.. ఆయన కార్యాలయానికి..(దీనిలోనే ఇల్లు కూడా ఉంది) నిప్పు పెట్టారు.
ఇక, పోలీసులు అంబటిని అరెస్టు చేసే వరకు.. ఈ ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇక, తాజాగా అదే రోజు.. మాజీ మంత్రి జోగి రమేష్ కూడా నోరు పారేసుకున్నారు. మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని నిరసిస్తూ.. ఆదివారం టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన ఆందోళన కారులు.. మంత్రి లోకేష్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి నిప్పు పెట్టాయి. దీంతో హుటాహుటిన స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు.
పారిపోయిన జోగి
టీడీపీ కార్యకర్తలు తన నివాసాన్ని ముట్టడించేందుకు వస్తున్నారని తెలుసుకున్న జోగి రమేష్.. ఇంటి నుంచి పారిపోయారు. ఆయన ఒక్కరే వెళ్లిపోవడంతో ఇంట్లో ఆయన తండ్రి, సతీమణి ఉండిపోయారు. వారంతా బెడ్ రూంలో తలదాచుకోగా.. పోలీసు లు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇంతలోనే వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకుని టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాలపైనా పోలీసులు లాఠీలు ఝళిపించారు. అనంతరం.. వైసీపీ కార్యకర్తలు.. జోగి ఇంటి వద్ద, టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్దా నిరసన తెలిపాయి.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. ప్రస్తుతం ఇరు వర్గాల ను శాంతింపజేశామని.. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కాగా.. నకిలీ మద్యం కేసులో కొన్ని నెలలుగా జైల్లో ఉన్న జోగి బ్రదర్స్కు ఇటీవలే కోర్టు బెయిల్ ఇచ్చింది. జోగి బయటకు వచ్చాక.. నారా లోకేష్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ``లోకేష్కు ఒళ్లు తగ్గింది కానీ బుద్ధి పెరగలేదు`` అంటూ.. దూషించారు. దీంతో పాటు పరుష పదాలు వినియోగించారు. ఈ వ్యాఖ్యలే టీడీపీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.