ఏపీ సీఎం చంద్రబాబు మరో గిన్నిస్ రికార్డు సృస్టించారు. ఒకేసారి 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. చిత్తూరు జిల్లా ఆ ఘనత సాధించిందని గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు పత్రాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ అందుకున్నారు.
కుప్పంలో రెండో రోజు పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ-సైకిళ్ల పంపిణీ, సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రం చేపట్టారు. ఈ క్రమంలోనే తూంసీ వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం ప్రజా వేదిక ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే శివపురం నుంచి ప్రజావేదిక వరకు చంద్రబాబు ఈ-సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో చంద్రబాబు పాల్గొని 3 కిలోమీటర్ల దూరం యువకుడిలా హుషారుగా ఈ-సైకిల్ తొక్కారు. ప్రజా వేదిక డయాస్ వరకు చంద్రబాబు సైకిల్ పై వచ్చారు. ఆ తర్వాత పెన్షన్లు పంపిణీ చేసి, డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
కుప్పం నుంచి నవ చరిత్రకు శ్రీకారం చుట్టామని, కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. గిన్నిస్ రికార్డు సాధించడం ఒక విషయమని, ఈ సైకిళ్ల వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలుంటాయని చెప్పారు. సౌర విద్యుత్ తో సైకిల్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చని, ఈ సూపర్ సైకిల్.. పైసా ఖర్చు లేకుండానే దూసుకెళ్తుందని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటేశారని, సైకిల్ కుప్పానిదని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని చెప్పారు. యువతతో పోటీపడి మరీ చంద్రబాబు సైకిల్ తొక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రబాబు వయసు గురించి మాట్లాడే ముందు జగన్ ఈ వీడియో చూడాలని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబుకు ఏజ్ ఒక నంబర్ మాత్రమేనని, ఆయన ఫిట్ నెస్, ఆహార నియమాలు పాటించే నిబద్ధత, జీవన శైలి జగన్ కు సాధ్యం కాదని చురకలంటిస్తున్నారు.