``అమరావతి లేదంటున్నావు. అమరావతి కాదంటున్నావు. మరి ఆనాడు ఐదేళ్లు ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన నువ్వు(జగన్) ఎక్కడ నుంచి పాలించావ్?. ఎక్కడ కూర్చుని అసెంబ్లీని నడిపించా వ్? ఎక్కడ కూర్చుని సమీక్షలు చేశావ్?`` అంటూ.. వైసీపీ అధినేత జగన్పై చంద్రబాబు నిప్పులు చెరిగా రు. అమరావతిని కాదంటున్నది.. తన పాలసీ అంటున్న జగన్.. ఆయన పాలన సాగించింది ఇక్కడ (అమరావతి) నుంచి కాదా? అని నిలదీశారు.
రైతులు వేలాది భూములు ఇస్తే.. ఆ భూములపైనే నిర్మాణాలు చేశామన్నారు. అప్పట్లో ట్రాన్సిట్ నిర్మాణా లు అని తాను చెబితే.. వాటిని వక్రీకరించి తాత్కాలిక నిర్మాణాలుగా ప్రచారం చేసి.. రాజధానిని లేకుండా చేయాలని ప్రయత్నించారని దుయ్యబట్టారు. అయినా.. ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేదన్న ఆయన.. రాజ ధాని రైతుల పోరాటం.. ఇక్కడి మహిళల కష్టం అన్నీ ఫలించాయని.. ఈ రాజధాని శాశ్వతంగా నిలిచి ఉం టుందని పేర్కొన్నారు.
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశాక భూమిని సమీకరించి సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశామని చెప్పారు. సింగపూర్ ఒక్క పైసా తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ను రూపొందించి మనకు ఇచ్చిందన్నారు. అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములను కూడా.. ఒక్క పిలుపు ఇవ్వగానే 29 వేల మంది రైతులు 34 వేల ఎకకరాలను ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ భూమి కూడా కలిపితే 54 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
తమ భవిష్యత్తు బాగుంటుందని రైతులకూ విశ్వాసం కలిగిందన్నారు. జరీబు భూములు కలిగిన వారికి 450 కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ రిటర్నబుల్ ప్లాట్ లు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఏటా యాన్యుటీ కూడా రైతులకు ఇస్తున్నామన్నారు. భూమిలేని రైతులకు కూడా పెన్షన్లు అదనంగా ఇస్తున్నామన్నారు. శంషాబాద్ లో భూములు ఇచ్చిన వారంతా కోటీశ్వరులు అయ్యారని గుర్తు చేశారు. సిటీ రీజియన్ 56 మండలాలు, 8603 చదరపు కిలోమీటర్లమేర, 117 చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీని నిర్దేశించామన్నారు.
వచ్చే 11 నెలల్లో సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మాణం చేస్తామన్నారు. ట్రాన్సిట్ అంటే దానిని తాత్కాలికం అని వక్రీకరించారని, వాస్తవానికి 2016 జూన్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ అమరావతి నుంచే నిర్వహించామని చంద్రబాబు తెలిపారు. అమరావతిని వ్యతిరేకించిన గత పాలకులు గతిలేని పరిస్థితిలో ఈ గడ్డపై నుంచే పాలన సాగించారని ఎద్దేవా చేశారు.