ప్రపంచ పటంలో తెలుగు జాతి కీర్తిని చాటడమే కాదు, హైందవ ధర్మ వైభవాన్ని ఖండాంతరాలు దాటించడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తనదైన ముద్ర వేస్తున్నారు. ఆధ్యాత్మికతను, ఆధునికతను జోడిస్తూ ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు యూరప్ దేశమైన నెదర్లాండ్స్లో అద్భుతానికి దారితీశాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలను ప్రపంచవ్యాప్తంగా నిర్మించాలన్న బాబు సంకల్పానికి, టీటీడీ కార్యాచరణ తోడవడంతో మరో బృహత్కార్యానికి అంకురార్పణ జరిగింది.
కేవలం టెక్నాలజీ, ఐటీ రంగాల్లోనే కాదు, ఆధ్యాత్మిక ప్రచారంలోనూ ఏపీ ముఖ్యమంత్రి విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఆదేశాల మేరకు టీటీడీ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం ఏకంగా 33.5 ఎకరాల భారీ కేటాయింపు చేయడం విశేషం. విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో జరగనున్న ఈ నిర్మాణంలో టీటీడీ సాంకేతిక, ఆధ్యాత్మిక సహకారాన్ని అందించబోతోంది.
దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించతలపెట్టిన ఈ ఆలయం, కేవలం ప్రార్థనా మందిరంగానే కాకుండా, భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలవనుంది. గోపురాలు, ప్రాకారాలు, శిల్పకళా సౌందర్యంతో అలరారేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందిస్తూ, ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థపతి సహకారాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు గతంలోనూ తిరుమల సంప్రదాయాలను, టీటీడీ(TTD) సేవలను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశాల్లో ఉన్న తెలుగువారితో పాటు, హిందూ భక్తులందరికీ శ్రీవారి దర్శనాన్ని చేరువ చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది. నెదర్లాండ్స్ ఆలయ నిర్మాణం పూర్తియితే, ఐరోపా ఖండంలోనే ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదు.