విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు అనుకోని మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ కేవలం అదృశ్యం కేసుగానే భావించిన ఈ వ్యవహారంలో.. అసలు ఊహించని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మిస్ అవ్వలేదు.. అతడిని పోలీస్ లాకప్లోనే కొట్టి చంపేశారంటూ ప్రత్యేక విచారణ బృందం (SIT) సంచలన నివేదిక ఇచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
సాయికృష్ణ(Sai Krishna) అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సిట్’ను రంగంలోకి దించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు మార్కాపురం స్టేషన్కు చెందిన సిబ్బందిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో గుండె గుభేల్మనే నిజాలు బయటపడ్డాయి. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే సాయికృష్ణ లాకప్లోనే ప్రాణాలు విడిచాడని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా, ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు ఉన్నతాధికారి హోదాలో ఉన్న సీఐ నాగరాజు తీవ్రంగా ప్రయత్నించినట్లు తేలింది.
ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు ఎస్సై ఇచ్చిన వాంగ్మూలం. సాయికృష్ణ మృతదేహాన్ని తాను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో స్వయంగా చూశానని సదరు ఎస్సై సిట్(SIT) విచారణలో అంగీకరించడం సంచలనంగా మారింది. లాకప్ డెత్ జరిగిన తర్వాత, చట్టం నుండి తప్పించుకునేందుకు సీఐ నాగరాజు మాస్టర్ ప్లాన్ వేశారని సిట్ గుర్తించింది. మృతదేహాన్ని మాయం చేయడంతో పాటు, స్టేషన్లో అతనికి సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా పక్కాగా స్కెచ్ వేసి నాశనం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పొందుపరిచారు.
సిట్ ఇచ్చిన పక్కా ఆధారాలతో కోర్టు ముందు హాజరైన నిందితుడు, సీఐ నాగరాజు(CI Nagaraju)కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, భద్రతా కారణాల రీత్యా నాగరాజును నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలని పోలీసులు నిర్ణయించారు. రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారి, లాకప్ డెత్కు పాల్పడి ఆధారాలు మాయం చేయడం ఇప్పుడు విజయవాడతో పాటు రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో సిట్ మరిన్ని వివరాలు సేకరిస్తోంది.