తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. `కేసీఆర్.. నువ్వు తెలంగాణ కోసమే పుట్టానన్నావ్. తెలంగాణ సమస్యల కోసమే జీవితాన్ని త్యాగం చేశానని చెబుతున్నావ్.. మరి నీకు వెయ్యి ఎకరాల భూములు ఎక్కడ నుంచి వచ్చాయి? ఫామ్ హౌస్ ఎలా కట్టావ్?` అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. రాజకీయ అరంగేట్రం చేసి శనివారంతో 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తొలిసారి జెడ్పీటీసీ సభ్యుడిగా, ఇండింపెడెం టుగా గెలిచిన మిడ్జిల్ మండలంలో ఆయనను పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్(Revanth) గతాన్ని గుర్తు చేసుకుంటూనే వర్తమాన, భవిష్యత్తు రాజకీయాలపై కీలక వ్యాఖ్య లు చేశారు. రాష్ట్రంలో దొరల అహంకారానికి 2023లో ప్రజలు బొంద పెట్టారని వ్యాఖ్యానించిన ఆయన.. మరోసారి మరింత లోతుగా పూడ్చి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అనేక ఎత్తు పత్తాలను చూసిందన్నారు. అయితే.. ఎత్తుకు ఎక్కినప్పుడు గర్వంగా భావించలేదని.. పల్లానికి జారినప్పుడు కుంగిపోలేదని అన్నారు. ప్రజలను అంటిపెట్టుకుని వారితోనే తన రాజకీయాలను పంచుకున్నానని రేవంత్ చెప్పారు.
ప్రతి అడుగులోనూ ప్రజలే తనకు అండగా నిలిచారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో కీలకమైన మిడ్జిల్ మండల ప్రజలకు తాను ఎంతో చేయాల్సి ఉందన్నారు. ఇక్కడి ప్రజలు ఓటేయబట్టే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టగలిగానని వ్యాఖ్యానించారు. ఈ మండలాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దత్తత తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అధికారం కోసం పాకులాడలేదని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు. అధికారం ఉన్నా..లేకున్నా ప్రజల సమస్యలపైనే తన పయనం సాగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చరిత్ర అని కొందరు చెబుతున్నారని, కానీ.. ప్రజల తీర్పు సరైందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
గద్దర్-గడీ!
తెలంగాణ ప్రజాగాయకుడు, ప్రజల హృదయాల్లో ఉన్న గద్దర్ను.. గడీల పాలన(కేసీఆర్)లో గడప ముందు నిలబెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు సొంతిల్లు ఇవ్వడం మానేసి.. సొంతానికి వెయ్యి ఎకరాలు సంపాయించుకుని ఫామ్ హౌస్ కట్టుకు న్నారని విమర్శించారు. ఇప్పుడు పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. రాష్ట్రం రూపాయి అప్పులేకుండా ఏర్పడితే.. పదేళ్లలో దీనిని అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పాలనపై చురకలు వేశారు. `70 వేల కోట్ల రూపాయల అప్పు ఉన్న రాష్ట్రాన్ని 8లక్షల, 50వేల కోట్ల రూపాయల అప్పుల స్థాయికి దిగజార్చారు` అని వ్యాఖ్యానించారు. కేసీఆర్(KCR) హయాంలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు.