ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం సహజం. కానీ ఏపీలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలండర్ను అమలు చేస్తూ పద్ధతి ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మాత్రం దీనిని తప్పుపడుతూ రోడ్డెక్కడం విశేషం.
డీఎస్సీ(DSC) ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గత ప్రభుత్వం తరపు నేతలు పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరలేపారు. అంతేకాదు, తాము చేస్తున్న రాజకీయ ఆందోళనలకు ఏకంగా 'జెన్-జీ' (Gen-Z) ఉద్యమం అనే కొత్త ట్యాగ్ను తగిలించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జాబ్ క్యాలండర్ను పూర్తిగా విస్మరించి, కేవలం సంక్షేమ పథకాలకే పరిమితమైన విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతుండటం గమనార్హం.
ఈ విమర్శలు, రాజకీయ డ్రామాలకు మాటలతో బదులివ్వడంకంటే చేతలతోనే సమాధానం చెప్పాలని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్తో మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. 'జాబ్ క్యాలండర్-2026' ప్రణాళికలో భాగంగా భర్తీ చేయాల్సిన పోస్టులపై మంత్రి లోకేష్ తాజాగా ప్రముఖ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించి రోడ్మ్యాప్ ఖరారు చేశారు.
ఈ క్యాలండర్ ప్రకారం మొత్తం 10,060 పోస్టులను నిర్దేశిత కాలపరిమితిలోగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాలలో 1,523 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం కాగా, నిరుద్యోగులకు మరింత ఊరటనిచ్చేలా సెప్టెంబర్ 15న మరో 3,168 పోస్టులకు అధికారిక నోటిఫికేషన్(Notification) జారీ చేయనున్నారు. ఆ వెంటనే వరుసగా వచ్చే మరో రెండు నోటిఫికేషన్ల ద్వారా 2,388 మరియు 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ ఈ ఏడాది డిసెంబర్ లోగా విజయవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక గతంలో ఉద్యోగాల జాడే లేకుండా కాలం గడిపిన వారు, ఇప్పుడు పక్కా షెడ్యూల్తో నిరుద్యోగులకు భోగ్రాన్ని ఇస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తే యువత ఎలా సహిస్తుంది? రాజకీయ లబ్ధి కోసం యువత భవిష్యత్తును అడ్డుపెట్టుకుని ఆడుతున్న ఈ నాటకాలను నేటి యువత ఇట్టే పసిగట్టేస్తుంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ ఉద్యోగాల పరంపరతో విపక్షాల కుట్రలకు కాలం చెల్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.