డీఎస్సీ-2025 వ్యవహారంపై వెనుకంజ వేయవద్దని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దే శం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ప్రజలకు వరకు చేరాయన్న ఆయన.. మరింత వేడి పెంచాలని సూచించారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో బుధవారం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలుకీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. మండలిలో ఉన్న బలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అయితే.. అసెంబ్లీకి వెళ్లే విషయాన్ని మాత్రం ఆయన కొట్టిపారేశారే. బద్వేల్ ఎమ్మెల్యే సుధతీరుపై ఒకింత అసహ నం వ్యక్తం చేసిన జగన్.. సభకు వెళ్లకూడదన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్నామని.. త్వరలోనే తీర్పు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబును ఎలాగైనా సరే.. ఈ విషయంలో న్యాయ పోరాటం ద్వారా ఒప్పిద్దామన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సభ్యులు.. సభకు వెళ్లకపోయినా.. మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని సూచించారు.
కానీ, మండలిలో వైసీపీదే పైచేయిగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అంశాన్నీ ప్రస్తావించాలన్నారు. ముఖ్యంగా మంత్రి లోకేష్ రాజీనామా విషయం పై మండలిలో చర్చించాలని సీనియర్ ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.కొందరు మాత్రమే అన్నీ చూస్తున్నారని.. అలా కాకుండా సబ్జెక్టుల వారీగా అందరూ మండలిలో ప్రసంగించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై పైచేయి సాధిం చే క్రమంలో ఎక్కడా వెనక్కి తగ్గవద్దని కూడా సూచించారు.
నేను ఇంట్లోనే..
ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని ఓ ఎమ్మెల్యే సూచించగా.. అవ సరం లేదని.. అలా అయితే పలుచన అయిపోతామని జగన్ వ్యాఖ్యానించారు. తాను కూడా ఇంట్లోనే ఉండి.. ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానన్నారు. సభలో ఏం జరుగుతున్నా లైవ్లో చూసుకునే అవకాశం ఉందని.. కాబట్టి.. ప్రభుత్వం చేసే విమర్శలను బయట నుంచి తిప్పికొట్టవచ్చన్నారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్న జీతాల విషయంపై మాట్లాడుతూ.. ``అలా ఎక్కడా జరగలేదు. ఇక్కడ కూడా జరగదు. మీరేం గాబరా పడొద్దన్నా.`` అని వ్యాఖ్యానించారు.