ఏపీ శాసన మండలి సమావేశాలు హీటెక్కాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన మండలి సమావే శాల్లో మెగా డీఎస్సీ-2025పై చర్చకు పట్టుబడుతూ.. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే.. జీరో అవర్ను కొనసాగనివ్వాలని.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని చైర్మన్ మోషేన్ రాజు కోరారు. ఈ సమయం లో అధికార టీడీపీ-ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై విరుచుకుపడ్డారు.
తాము మెగా డీఎస్సీ-2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమేనని అన్నారు. అయితే.. 2019-24 మధ్య కాలంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైసీపీ ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశా రు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా.. ఒక్కరికి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేని దద్దమ్మగా మిగిలిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో వైసీపీ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై చర్చకు అధికార పక్షం భయపడుతోం దని.. అందుకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని సభ్యులు ఎదురు దాడి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే.. ఈ సమయంలో ఇటు టీడీపీ సభ్యులు కూడా ఎదురు దాడి చేశారు. ప్రజలకు ఏమీ చేయలేని దద్దమ్మలు కాబట్టే.. ఓడించారని మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. దీంతో మండలిలో తీవ్ర వాగ్యుద్ధం, గందరగోళం చోటు చేసుకుంది.
వ్యక్తిగత విమర్శలు కావు..
దద్దమ్మ అనేది వ్యక్తిగత విమర్శకాదని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దీనిలో ఎలాంటిదూషణ లేదని చెప్పారు. పనిచేయడం చేతకాని వారిని అనే పదమని.. అచ్చెన్నాయుడు ఉద్దేశ పూర్వకంగా బొత్సను ఏమీ అనలేదని పేర్కొ న్నారు. డీఎస్సీ ఎందుకు వేయలేకపోయారో.. నిరుద్యోగ యువతను ఎందుకు మోసం చేశారో.. వైసీపీ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాగా.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అవకతవకలపై చర్చ చేయాల్సి వస్తుందనే బొత్స సత్యనారా యణ ఇలా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా బొత్స మాట్లాడుతూ.. గ్రూప్-1పై చర్చకు తాము సిద్ధమేనన్నారు.