సినీ ఇండస్ట్రీకి కొరకరాని కొయ్యలా మారి.. పైరసీ భూతంతో ఇండస్ట్రీని శాసించిన `ఐబొమ్మ` నిర్వాహకు డు ఇమ్మంది రవికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి రవికి బెయిల్ లభించరా దని.. అనేక మంది సినీ ప్రముఖులుకోరుకున్నారు. కానీ.. రవి చూపించిన కారణాలతో ఏకీభవించిన హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. ముఖ్యంగా పాస్ పోర్టును తక్షణమే పోలీసులకు సరెండర్ చేయాలని ఆదేశించింది.
3 నెలలుగా జైల్లోనే..
పైరసీ సినిమాలతో ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతోందని.. పలువురు చిన్న నిర్మాతలు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టాయి. విడుదలైన సినిమాను విడుదలైనట్టే.. పైరసీ చేయడం.. అదే రోజు యూట్యూబులు సహా.. పెన్ డ్రైవుల్లోకి ఎక్కించేయడంతో సినీ పెద్దలు తలలు పట్టుకున్నారు. దాదాపు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కూడా పోలీసులు గుర్తించారు. ఈ పరిణామాలతో ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని చాకచక్యంగా పట్టుకున్నారు.
గత ఏడాది నవంబరు 16న అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న రవిని పలుమార్లు కస్టడీలోకి తీ సుకుని విచారించారు. తన ప్రవర్తన మార్చుకుంటానని కొన్నాళ్లు.. తాను తప్పు చేయలేదని కొన్నాళ్లు.. కోట్ల మంది వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని ఒకసారి ఇలా.. రవి.. చెప్పిన మాటలు పోలీసులకు సవాళ్లుగా మారాయి. అంతేకాదు.. తాను పట్టుబడినా.. వ్యవస్థ పట్టుబడదని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక.. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నించినా.. అనేక కారణాలతో రవికి బెయిల్ లభించలేదు. ఇక, నిబంధనల ప్రకారం మూడు మాసాల్లో నేరాన్ని నిరూపించాల్సి రావడం.. మధ్యంత చార్జిషీట్ను వేయక పోవడం వంటివి రవికి కలిసి వచ్చినట్టు న్యాయవాదులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం రవికి షరుతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
ఇవీ.. షరతులు..
+ పాస్ పోర్టును పోలీసులకు అందించాలి.
+ దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు.
+ ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ స్టేషన్లో సంతకం చేయాలి.
+ ఇంటర్నెట్ వినియోగించడానికి వీల్లేదు.
+ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి.
+ విచారణకు సహకరించాలి.