టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఈ ఇద్దరి పేర్లు వింటేనే సోషల్ మీడియా షేక్ అవుతుంది. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్పై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటల వరకు వ్యవహారం వెళ్లడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా ఫిబ్రవరి 26న జరగనున్న ఈ వేడుకకు అంతా సిద్ధమైంది. అయితే, ఈ పెళ్లికి సినీ గ్లామర్తో పాటు అనూహ్యంగా పొలిటికల్ టచ్ కూడా తోడవ్వడం విశేషం.
సాధారణంగా సినీ ప్రముఖుల పెళ్లిళ్లకు విష్ చేయడం చూస్తుంటాం, కానీ విజయ్-రష్మిక జంటకు సాక్షాత్తూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శుభాకాంక్షలు అందడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ``సప్తపది అనే పవిత్ర బంధంతో ఏడడుగులు వేస్తూ జీవిత భాగస్వాములుగా మారుతున్న మీకు నా శుభాకాంక్షలు`` అంటూ మోదీ పంపిన సందేశం ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ జంట తమ జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని, వారి వైవాహిక జీవితం ప్రేమ, గౌరవంతో నిండి ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకకు ఉదయ్పూర్లోని ప్రఖ్యాత 'మెమంటో ఐటీసీ హోటల్' వేదికైంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుకను చాలా ప్రైవేట్గా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెళ్లిలో మరో హైలైట్ ఏమిటంటే.. రెండు వేర్వేరు సంప్రదాయాల కలయిక! విజయ్ కోసం తెలుగు పద్ధతిలోనూ, రష్మిక కోసం వారి కర్ణాటక 'కొడవ' సంప్రదాయంలోనూ పెళ్లి తంతు జరగనుంది. మొత్తానికి ఒకవైపు రాయల్ వెడ్డింగ్ ఏర్పాట్లు, మరోవైపు దేశ ప్రధాని నుంచి అందిన అరుదైన గౌరవంతో `విరోష్` వివాహం ఇప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్ వెడ్డింగ్స్లో ఒకటిగా నిలిచిపోనుంది. మరికొన్ని గంటల్లో ఒకరికొకరు తోడుగా ఉండబోతున్న ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు.
