కొందరు నాయకుల వ్యవహార శైలి టీడీపీ(TDP)కి ఇబ్బందిగా మారింది. నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు మై-టీడీపీ యాప్ సిద్ధంగా ఉంది. దీనిద్వారా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను కూడా ప్రస్తావించేందుకు అవకాశం ఉంది. వాస్తవానికి ఈ వేదికపైనే నాయకులు తమ అభిప్రాయం చెప్పాలని చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా చెబుతున్నారు. అయినా.. కొందరు నాయకులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా సత్యవేడు(Satyavedu) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు మీడియా ముందుకు వచ్చి పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ఆయన ఎత్తి చూపారు. నియోజకవర్గంలో ఇంచార్జ్ను నియమించి.. తన తండ్రిని అవమానిస్తున్నారని.. కనీసం ఎమ్మెల్యేగా కూడా చూడడం లేదన్నారు. ఇదేసమయంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని కూడా ఆదిమూలం కుమారుడు విమర్శ లు గుప్పించారు. ఇలానే మరోరెండు నియోజకవర్గాల్లోనూ కుటుంబ సభ్యులు తెరమీదికి వచ్చారు.
ఇలాంటి వారి వల్ల ప్రయోజనం కంటే కూడా.. పార్టీకి నష్టమే ఎక్కువగా ఉందన్నది పరిశీలకులు చెబుతున్నమాట. అంతేకాదు.. ప్రతివిషయాన్నీ రాజకీయం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వైసీపీ(YCP) నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారన్న చర్చ కూడా పార్టీలో ఉంది. ఈ క్రమంలో ఇలాంటివారిని తప్పించాలని కొందరు చెబుతున్నారు. మరికొందరు నాయకులు తామే తప్పుకొనేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం ఇస్తున్నారు.
కార్యకర్తల పరంగా.. నాయకత్వం పరంగా బలంగా ఉన్న టీడీపీకి నాయకులు వచ్చినా.. వెళ్లినా.. ఇబ్బంది లేదు. కానీ, ఇదేసమయంలో వెళ్తున్న నాయకులు చేస్తున్న యాగీ మాత్రం పార్టీకి ఒకింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని ఇలాంటి వారి విషయంలో చర్చలు తీసుకోవాలన్న సూచనలు అందుతున్నాయి. విజయనగరం(Vijayanagaram)లోనూ ఒక ఎమ్మెల్యే వివాదంగా మారడం.. శ్రీకాకుళంలో మరో ఎమ్మెల్యే నేరుగా గల్లా పెట్టె పట్టుకుని తిరగడంవంటివి పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి.