కుంభమేళాలో తన అందంతో, ఆకర్షణీయమైన కళ్లతో రాత్రికి రాత్రి సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన మోనాలిసా భోస్లే(Monalisa Bhosle) ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈసారి ఆమె పాజిటివ్ వార్తలతో కాదు, తన జీవితంలో ఎదురైన చీకటి కోణాలను బయటపెడుతూ చేసిన సంచలన ఆరోపణలతో అందరినీ షాక్కు గురిచేస్తోంది. తనను వెండితెరకు పరిచయం చేస్తానన్న దర్శకుడే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె గళమెత్తింది.
‘ది డైరీ ఆఫ్ మణిపూర్’(The Diary of Manipur) చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తనను తీవ్రంగా వేధించాడని మోనాలిసా ఆరోపించింది. షూటింగ్ నెపంతో పదే పదే తనను అసభ్యకరంగా తాకాడని, దాదాపు పది సార్లు తన పట్ల హేయంగా ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొచ్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైంది. తనపై జరుగుతున్న అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు వివరించినా, వారు తనకు మద్దతుగా నిలవలేదని ఆమె పేర్కొనడం గమనార్హం.
ఈ వేధింపుల వ్యవహారంపై మోనాలిసా ఏప్రిల్ 29న ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శకుడు సనోజ్ మిశ్రా(Director Sanoj Mishra)తో పాటు మరో ముగ్గురిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. నిందితుల్లో ఒక న్యాయవాదితో పాటు విశ్వహిందూ పరిషత్ నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగినందున, తదుపరి విచారణ నిమిత్తం కేసును అక్కడికి బదిలీ చేసేందుకు కేరళ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్థానిక కోర్టులో బాధితురాలి వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు.
మోనాలిసా కెరీర్ పరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఫర్మాన్ ఖాన్(Farman Khan) అనే యువకుడిని ఆమె ప్రేమించి వివాహం చేసుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది 'లవ్ జిహాద్' అంటూ ఆమె తల్లిదండ్రులతో పాటు దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా ఆరోపణలు చేశారు. అయితే, వివాహం జరిగిన సమయంలో మోనాలిసా మైనర్ అని తేలడంతో ఫర్మాన్ ఖాన్పై కూడా గతంలో కేసు నమోదైంది. తాజాగా ఆమె గర్భవతి అనే వార్తలు కూడా ఈ వివాదానికి మరిన్ని మలుపులు ఇస్తున్నాయి. ఒకవైపు సినిమా అవకాశాలు, మరోవైపు వ్యక్తిగత గొడవలు, ఇంకోవైపు దర్శకుడిపై చేసిన సంచలన ఆరోపణలు.. కలిసి కుంభమేళా బ్యూటీ చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ కేసులో విచారణ మున్ముందు ఇంకెన్ని నిజాలను బయటపెడుతుందో చూడాలి.