టాలీవుడ్లో ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మద్య నడుస్తున్న మాటల యుద్ధం శ్రుతి మించుతోంది. ముందుగా తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం తరఫున శిరీష్, సునీల్ నారంగ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి.. సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు చేయకపోతే వాటిలో కొత్త సినిమాలను రిలీజ్ చేయనివ్వమని అల్టిమేటం విధించారు. తర్వాత నాగవంశీ, రవిశంకర్ తదితర ప్రొడ్యూసర్లు ప్రెస్ మీట్ పెట్టి సింగిల్ స్క్రీన్లలో మెయింటైనెన్స్ సహా పలు విషయాల గురించి మాట్లాడి కౌంటర్ ఇచ్చారు.
దీనికి మళ్లీ ఎగ్జిబిటర్ల వైపు నుంచి రివర్స్ కౌంటర్లు మొదలయ్యాయి. నిన్నటి ప్రెస్ మీట్లో ప్రధానంగా అందరూ తననే టార్గెట్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో నంబర్ వన్ ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్కు కోపం వచ్చింది. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ మల్టీప్లెక్సులు కడుతున్న ఒక అర్హత లేని వ్యక్తి కామెడీ చేస్తున్నాడు అంటూ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన నాగవంశీ మీద ఫైర్ అయ్యాడు సునీల్. ఒక టీవీ ఛానెల్తో ఆయన మాట్లాడుతూ.. నాగవంశీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాగవంశీ పేరు కూడా తనకు తెలియనట్లుగా.. అతనెవరు, స్పెక్ట్స్ పెట్టుకుని ఉంటాడు.. బట్టతల ఉంటుంది.. ఫేక్ హెయిర్ ఉంటుంది.. పాము అంటూ సెటైర్లు వేసి చివరగా ‘నాగవంశీ’ అనే పేరును పలికిన ఆయన.. ‘‘నేను ఎక్కడ స్థలం కనబడితే అక్కడ మల్టీప్లెక్సులు కట్టేస్తునంట. ఈ లిస్ట్ ఉంది. 33 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి మేం కట్టినవి. ఇంకా 5 థియేటర్లు కడుతున్నాం’’ అంటూ ఒక పేపర్లో తమ ఆధ్వర్యంలోని సింగిల్ స్క్రీన్ల లిస్టు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు సునీల్..
తాను మరో 15 సింగిల్ స్క్రీన్లను బుకింగ్ చేసుకున్నానని.. వాటిని కూడా బాగు చేసి, యజమానులకు అంతా మంచి జరగాలనే తాను కోరుకుంటానని సునీల్ వ్యాఖ్యానించారు. మల్టీప్లెక్సులు కూడా ఏమీ బాగా లేవని.. పర్సంటేజీ తీసుకున్నా కూడా వాటి పరిస్థితి కూడా అంతంతమాత్రమే అని.. మహా అయితే బ్రేక్ ఈవెన్కు మాత్రమే వస్తున్నాయని.. సింగిల్ థియేటర్లకు పర్సంటేజీ ఇస్తే కొంచెం బతుకుతాయన్నదే తమ ప్రయత్నం అని ఆయన స్పష్టం చేశారు.