ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ చరిత్రలో 2024 జూన్ 4 ఒక చెరగని అధ్యాయం. వై నాట్ 175 అంటూ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో, కాదూ కూడదంటే అహంభావంతో అడుగులు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా గద్దె దించేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించిన రోజది. అయితే, ఈ చారిత్రాత్మక పరాభవం జరిగి సరిగ్గా రెండేళ్లు గడుస్తున్నా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిలో కానీ, ఆ పార్టీ ఆలోచనా విధానంలో కానీ ఎలాంటి మార్పు రాలేదనేది తాజా రాజకీయ పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది.
సాధారణంగా అంతటి భారీ ఓటమి ఎదురైనప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మపరిశీలన చేసుకుంటుంది. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో విశ్లేషించుకుని తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వైసీపీ మాత్రం ఇప్పటికీ అదే పాత పంథాను కొనసాగిస్తోంది. మూడు రాజధానుల ముసుగులో అమరావతిని వ్యతిరేకించడం, 'మావిగన్' అంటూ పాత రాగాన్ని అందుకోవడం చూస్తుంటే.. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో ఆ పార్టీ ఇంకా మొండిగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం సంక్షేమ పథకాల బటన్ నొక్కితే సరిపోతుందని, అభివృద్ధి, ఉపాధి అవసరం లేదనే భ్రమల నుంచి వైసీపీ(YCP) నాయకత్వం ఇంకా బయటపడకపోవడం ఆశ్చర్యకరం.
మరోవైపు, అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర భవిష్యత్తును మార్చే పనిలో పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తన సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం పక్కనబెట్టిన రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలు కేవలం ఉచిత పథకాలను మాత్రమే కోరుకోవడం లేదని, తమ పిల్లల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు కావాలని భావిస్తారని కూటమి ప్రభుత్వం గుర్తించింది.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పెట్టుబడుల వరద పారుతోంది. కొత్త పోర్టులు, ఎయిర్పోర్టులు, మౌలిక వసతుల కల్పనతో ఏపీ(AP) రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న బలమైన సత్సంబంధాలను రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు సమర్థవంతంగా వాడుకుంటున్నారు. ఫలితంగా, వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళడానికి, తాము చేసిన అభివృద్ధిని చూపించడానికి కూటమి ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన, భారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధంగా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. "మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ అమరావతిని ఆపేస్తాం, మళ్ళీ రంగులు మారుస్తాం, కూల్చివేతలు మొదలుపెడతాం" అని చెబితే ప్రజలు నమ్ముతారా? అభివృద్ధిని పక్కనబెట్టి కేవలం ఉచితాలతో కాలం వెళ్లదీస్తామనే పాత ఫార్ములాను ఏపీ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. అయినా సరే, వైసీపీ(YCP) అదే మొండి వైఖరికి కట్టుబడి ఉండటం ఆ పార్టీ స్వయంకృతాపరాధమే అవుతుంది. ఏదేమైనా రాజకీయాల్లో మారిన కాలంతో పాటు మారకపోతే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. వైసీపీ తన పాత పద్ధతులను, 'మావిగన్' సిద్ధాంతాలను ఎంత బలంగా పట్టుకుని కూర్చుంటే.. అది కూటమి ప్రభుత్వానికి అంత పెద్ద రాజకీయ వరంగా మారబోతోంది.