బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సన్నీ లియోన్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటివరకు కేవలం వెండితెరపై తన అందచందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ భామ, ఇప్పుడు ఏకంగా రూ.2,400 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటకకు చెందిన ఒక సంస్థ చేసిన మెగా మోసంలో సన్నీ లియోన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో, కర్ణాటక సీఐడీ (CID) అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. కర్ణాటక(Karnataka)కు చెందిన ‘శివమ్ అసోసియేట్స్’ అనే సంస్థ ప్రజల నుంచి దాదాపు రూ.2,400 కోట్ల మేర అక్రమ డిపాజిట్లు సేకరించి, బోర్డు తిప్పేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ అధినేత శివానంద నీలణ్ణవర్పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసుకు సన్నీ లియోన్కు ఉన్న లింకేంటా అని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సదరు సంస్థ యజమాని 2023లో ‘ఛాంపియన్’ అనే కన్నడ సినిమాను నిర్మించాడు. అందులో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ కోసం సన్నీ లియోన్ను రంగంలోకి దించారు. ఆ ఒక్క పాట కోసం ఆమెకు ఏకంగా రూ. 1 కోటి పారితోషికం ఇచ్చినట్లు బ్యాంక్ లావాదేవీల ద్వారా సీఐడీ గుర్తించింది.
సామాన్య ప్రజలను మోసం చేసి వసూలు చేసిన అక్రమ సొమ్మునే సన్నీ లియోన్(Sunny Leone)కు పారితోషికంగా కట్టబెట్టారా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు పారితోషికం వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ సన్నీకి నోటీసులు పంపారు. దీంతో ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంలో సన్నీ లియోన్ సమాధానం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ స్కామ్ వ్యవహారం కేవలం సన్నీ లియోన్తోనే ఆగడం లేదు. ఇదే సంస్థ గత డిసెంబరులో నిర్వహించిన కన్నడ ఉత్సవం వేడుకలకు ప్రజల సొమ్మునే విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో పాల్గొని భారీగా నజరానాలు అందుకున్నారనే అనుమానంతో కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు ‘డాలి’ ధనుంజయ్, 'కాంతార(Kantara)' ఫేమ్ సప్తమీ గౌడ, వశిష్ఠ సింహ, రాగిణి ద్వివేదిలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. మొత్తానికి ఈ రూ.2,400 కోట్ల స్కామ్ శాండల్వుడ్తో పాటు బాలీవుడ్ను కూడా గట్టిగానే కుదిపేస్తోంది.