అంతకుముందు వేరే ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ భూమిపూజ జరగడం రాజకీయాల్లో మామూలే. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. కొన్నిసార్లు సహేతకమైన కారణాలతోనే ఇలా చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంటుంది. కొన్సి సందర్భాల్లో మాత్రం క్రెడిట్ కోసం ఈ పని చేస్తుంటారు.
తాజాాగా కూటమి ప్రభుత్వం ఇలాగే చేసిందంటూ విమర్శలు వచ్చాయి. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు అకాడమీ పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో భూమి కేటాయించింది. ఆ ప్రభుత్వం దిగిపోయాక 2024 నవంబరులో సింపుల్గా భూమి పూజ కూడా చేసింది సింధు. కానీ అక్కడ అకాడమీ పనులు మొదలు కాలేదు. కాగా ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి, ఎంతోమంది ప్రముఖుల నడుమ మళ్లీ సింధు భూమి పూజ చేసింది.
ఈ సందర్భంగా పెద్ద సమావేశం లాంటిది ఏర్పాటు చేయడం.. అందులో సింధు, లోకేష్ సహా పలువురు ప్రముఖులు మాట్లాడ్డం జరిగింది. ఐతే గతంలోనే భూమి పూజ జరిగినప్పటికీ. మళ్లీ నారా లోెకేష్ క్రెడిట్ చోరీ కోసం ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించారని.. సింధును కూడా ఈ విషయంలో ఒత్తిడి చేశారని వైసీపీ అనుకూల మీడియా వర్గాలు, కార్యకర్తల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శలకు నేరుగా సింధునే సమాధానం ఇచ్చింది.
ఈ మేరకు ఆమె ఎక్స్లో పోస్టు కూడా పెట్టింది. గతంలో జరిగిన భూమి పూజ కార్యక్రమం గురించి తమకు 7 గంటల ముందే సమాచారం వచ్చిందని.. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవ్వరినీ ఆ కార్యక్రమానికి పిలవలేకపోయానని.. తనకు మొదటి నుంచి మద్దతుగా నిలిచిన చాలా మంది అందులో భాగం కాలేకపోయారని సింధు పేర్కొంది.
అంతే కాక సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ అకాడమీని మరింత విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కూడా జరిగిందని.. ఈ నేపథ్యంలో ఈ అకాడమీని పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లేందుకు, ఎక్కువమందిని ఇందులో భాగం చేసి, జనాలకు మరింతగా తెలిసేలా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇలా నిర్వహించాల్సి వచ్చిందని.. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషమని ఆమె పేర్కొంది.